కుప్పం వైసీపీ ఇన్ఛార్జి భరత్కు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం
ABN , First Publish Date - 2021-11-13T07:18:08+05:30 IST
వచ్చే నెల 14న ఎన్నికలు జరగనున్న జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అధిష్ఠానం కుప్పం ఇన్ఛార్జి భరత్ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో 38 ఏళ్ళ తర్వాత కుప్పం నుంచీ చట్టసభలో అడుగుపెట్టనున్న టీడీపీయేతర ప్రజాప్రతినిధిగా ఆయనకు గుర్తింపు దక్కనుంది.
తిరుపతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 14న ఎన్నికలు జరగనున్న జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అధిష్ఠానం కుప్పం ఇన్ఛార్జి భరత్ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో 38 ఏళ్ళ తర్వాత కుప్పం నుంచీ చట్టసభలో అడుగుపెట్టనున్న టీడీపీయేతర ప్రజాప్రతినిధిగా ఆయనకు గుర్తింపు దక్కనుంది. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావానికి మునుపు కాంగ్రెస్ పార్టీ బలంగా వుండేది. టీడీపీ ఏర్పడ్డాక ఆ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా మారిపోయింది. 1983లో జరిగిన తొలి ఎన్నికల నాటి నుంచీ చివరగా జరిగిన 2019 ఎన్నికల వరకూ వరుసగా టీడీపీ అభ్యర్థులే అక్కడ నుంచీ విజయఢంకా మోగించి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. తొలి రెండు ఎన్నికల్లో రంగస్వామినాయుడు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందగా తర్వాత 1989 నుంచీ ఇప్పటి వరకూ వరుసగా ఏడుసార్లు చంద్రబాబు గెలిచిన సంగతి తెలిసిందే. 1983 నుంచీ రంగస్వామి నాయుడు, చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెట్టగా గత ప్రభుత్వంలో గౌనివారి శ్రీనివాసులు ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెట్టారు. వీరంతా టీడీపీ తరపునే చట్టసభల్లో సభ్యులయ్యారు. కాంగ్రెస్ నుంచీ జడ్పీ ఛైర్మన్ వంటి పదవులు అధిష్టించిన వారు వున్నా చట్టసభల్లో అడుగుపెట్టిన టీడీపీయేతరులు లేకపోయారు. సుమారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత కుప్పం నుంచీ టీడీపీయేతర రాజకీయ పార్టీ తరపున చట్టసభలో అడుగుపెట్టే అవకాశం భరత్కు దక్కుతోంది.ఆయన తండ్రి చంద్రమౌళి రిటైర్డు ఐఏఎస్ అధికారి. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచీ వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అనారోగ్యంతో ఆయన మరణించాక తండ్రి స్థానంలో కుప్పం వైసీపీ ఇన్ఛార్జిగా భరత్ బాధ్యతలు తీసుకున్నారు. ఇదివరకు సీఎం జగన్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ఇపుడు ఎమ్మెల్సీగా భరత్కు అవకాశం దక్కుతోంది.