రహదారి భద్రతా నియమావళి పాటించాలి

ABN , First Publish Date - 2021-01-21T05:27:51+05:30 IST

రవాణాశాఖ రూపొందించిన భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్‌ పేర్కొన్నారు.

రహదారి భద్రతా నియమావళి పాటించాలి
ర్యాలీని ప్రారంభిస్తున్న ఎమ్మేల్యేలు ముస్తఫా, గిరిధర్‌, డీటీసీ మీరాప్రసాదు

ఎమ్యెల్యేలు ముస్తఫా, గిరిధర్‌

గుంటూరు(తూర్పు), జనవరి20: రవాణాశాఖ రూపొందించిన భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్‌ పేర్కొన్నారు. 32వ జాతీయ భద్రతా మాసోత్సవాలలో భాగంగా బుధవారం  హిందు కాలేజీ సెంటర్‌ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ భద్రతా ప్రాముఖ్యతను గుర్తించి నెలరోజులపాటు రోడ్డుప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిపారు. ఆటోలు, లారీలలో ఓవర్‌లోడ్‌ వేయరాదని అప్పుడే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ఎమ్మెల్యే గిరిధర్‌ మాట్లాడుతూ యువత వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీటీసీ ఈ.మీరాప్రసాదు మాట్లాడుతూ భద్రతా నియమాలు పాటించడం వలన వారికే కాకుండా ఇతర వాహనదారులకు కూడా మేలు జరుగుతుందన్నారు. ట్రాఫిక్‌ డీఎస్పీ రమణకుమార్‌ మాట్లాడుతూ ఆటోలలో డ్రైవరు పక్కన ప్రయాణికులను కూర్చోబెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ర్యాలీలో వీవీఐటీ విద్యార్థులతోపాటు, రవాణాశాఖ సిబ్బంది, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T05:27:51+05:30 IST