మిర్చి రైతుల్లో కలవరం
ABN , First Publish Date - 2021-10-18T05:25:16+05:30 IST
ప్రస్తుతం మిర్చి విఫణిలో నెలకొన్న పరిస్థితి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నది.
శీతల గిడ్డంగుల్లో 40 లక్షల టిక్కీల నిల్వ
రోజుకు సగటున 30 వేల టిక్కీలే విక్రయం
విదేశాలకు ఎగుమతుల్లో క్షీణత.. మరికొద్ది రోజుల్లో రానున్న కొత్త పంట
గుంటూరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం మిర్చి విఫణిలో నెలకొన్న పరిస్థితి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నది. కరోనా లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈ ఏడాది ఎక్కువ విస్తీర్ణంలో మిర్చి పంటని రైతులు సాగు చేశారు. అయితే ఎప్పుడూ లేని విధంగా గత వేసవికి ముందు కోల్డ్స్టోరేజ్లలో నిల్వ చేసిన మిర్చి టిక్కీలు యార్డు పునః ప్రారంభమైన తర్వాత నుంచి ఆశించినంత వేగంగా ట్రేడింగ్ జరగలేదు. దీంతో అక్టోబరు నెలాఖరు వస్తోన్నా ఇంకా గుంటూరు నగర పరిసరాల్లోనే 40 లక్షల టిక్కీల వరకు నిల్వ ఉండొచ్చని మిర్చియార్డు వర్గాలు అంచనా వేశాయి. ఇందులో కనీసం 30 లక్షల టిక్కీలు కొత్త సరుకు మార్కెట్కి వచ్చే లోపు విక్రయం జరగకపోతే కచ్ఛితంగా ఆ ప్రభావం ధరలపై పడే అవకాశం ఉంది. దీంతో రైతులు కొంత ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏటా ఈ పాటికే కోల్డ్స్టోరేజ్లలో నిల్వ చేసిన మిర్చి టిక్కీలు దాదాపుగా విక్రయం జరిగిపోయేవే. దాంతో మార్కెట్లో ధర పెరిగేది. క్వింటాల్ రూ.19 వేలను తాకిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇందుకు కారణం కోల్డ్స్టోరేజ్లలో భారీ సంఖ్యలో మిర్చి టిక్కీలు నిల్వ ఉండటమే. మరోవైపు కర్ణాటక, రాయలసీమలో పండిన ప్రస్తుత ఖరీఫ్ సీజన్ మిర్చి మరికొద్ది రోజుల్లోనే గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి రానుంది. ఆ పరిస్థితుల్లో ధరపై ప్రభావం పడొచ్చు. గత ఏడాది బంగ్లాదేశ్కి పెద్దఎత్తున మిర్చి ఎగుమతి జరిగింది. అక్కడి నుంచి పాకిస్థాన్, ఇతర ఆసియా దేశాలకు ఎక్స్పోర్టు కావడంతో నిత్యం లారీలలో మిర్చి టిక్కీలు అక్కడికి వెళ్లాయి. అలానే రైల్వే శాఖ ప్రత్యేక గూడ్స్లను నడిపింది. మరోవైపు దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా వివిధ వ్యవసాయ ఉత్పత్తులను గూడ్స్ రైళ్ల ద్వారా బంగ్లాదేశ్కి పంపిస్తున్నారు. అయితే అక్కడ ఒకేసారి అన్ని గూడ్స్లను హ్యాండిల్ చేసే సౌకర్యాలు అక్కడ లేకపోవడంతో సరుకుతో వెళ్లిన గూడ్స్ రైళ్లు అన్లోడింగ్ కావడానికి 10 రోజులకు పైగా సమయం పడుతుంది. ఇది కూడా ఎక్స్పోర్టులపై ప్రభావాన్ని చూపిస్తున్నది.
ఎక్కువ విస్తీర్ణంలో సాగు
మార్కెట్ ఒడిదుడుకులు గురించి రైతులు అంచనా వేయకుండా ధర నిలిచిందన్న ఒకే ఒక్క కారణంతో ఈ సంవత్సరం ఎక్కువ విస్తీర్ణంలో మిర్చి సాగు చేశారు. వ్యవసాయ శాఖ నుంచి ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారం వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చేరింది. దీంతో నిత్యం సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో మిర్చి టిక్కీలు ట్రేడింగ్ జరిగేలా చేసేందుకు మార్కెటింగ్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే పండగ సెలవు దినాలు వస్తోండటం, మిర్చియార్డులో వారంలో కేవలం ఐదు రోజులు మాత్రమే ట్రేడింగ్ జరుగుతుండటంతో వారానికి లక్ష నుంచి రెండు లక్షల మధ్యనే టిక్కీల విక్రయం జరుగుతున్నది. ఇప్పటి నుంచి వారానికి కనీసం మూడు లక్షల టిక్కీలకు పైగా ట్రేడింగ్ జరిగితేనే మార్కెట్లో ధరలు నిలుస్తాయి. లేదంటే కొత్త సరుకు వస్తూనే ధర పతనం కావడం ప్రారంభమౌతుందన్న అభిప్రాయం వ్యక్తమౌతున్నది.