సమాధులు కూల్చివేత.. బాధ్యులపై కఠిన చర్యలు
ABN , First Publish Date - 2020-09-27T10:21:22+05:30 IST
సమాధులు కూల్చివేత.. బాధ్యులపై కఠిన చర్యలు
రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత
చిలకలూరిపేటలో దళిత శ్మశానవాటికను పరిశీలించిన మంత్రి
తొలగించిన సమాధులు పునర్నిర్మిస్తామని హామీ
చిలకలూరిపేట, సెప్టెంబరు 26: దళితుల శ్మశానంలో సమాధులు కూలగొట్టిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని.. రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈ నెల 24న చిలకలూరిపేటలో జాతీయ రహదారి పక్కన ఉన్న దళిత, క్రైస్తవ శ్మశానవాటికలో అధికారుల ఆదేశాలతో సిబ్బంది సమాధులను కూలగొట్టిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శ్మశానవాటికను హోమంత్రి శనివారం పరిశీలించారు. దళిత నాయకులు, తమ పూర్వీకుల సమాధులకు చెందిన బాధితులు హోంమంత్రికి తమ ఆవేదన వెలిబుచ్చారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో మంత్రి సుచరిత మాట్లాడుతూ కొంతమంది అధికారుల అత్యుత్సాహం వలన ఈ ఘటన జరిగిందని, వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమాధులన్నీ పునర్నిర్మించి ఇస్తామన్నారు.
బాధితులు ఎవరూ బాధపడవద్దని పెద్దమనసుతో క్షమించాలని కోరారు. ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ సమాధుల తొలగింపు అధికారుల నిర్లక్ష్యం వలన జరిగిందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారిని తక్షణమే బదిలీ చేస్తున్నట్టు తెలిపారు. దళితులకు ఇబ్బందికి గురి చేసిన ఆ అధికారి స్థానంలో దళిత వర్గానికి చెందిన వ్యక్తినే నియమిస్తున్నామన్నారు. టీడీపీ వారు దీనిని రాజకీయం చేయడానికి చూస్తున్నారని దళితుల గురించి మాట్లాడే హక్కు వారికి లేదన్నారు. కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్కుమార్, ఘటనకు సంబంధించి విచారణ కమిటీ అధికారి గోకర్ణశాస్త్రి, నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్నుపూర్ తదితరులు ఉన్నారు. నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి ఆధ్వర్యంలో సీఐలు టి.వెంకటేశ్వర్లు, ఎం.సుబ్బారావులు బందోబస్తు పర్యవేక్షించారు.