ప్రైవేటు ఆస్పత్రుల్లో భారీగా వ్యాక్సిన్ నిల్వలు
ABN , First Publish Date - 2022-02-22T16:23:31+05:30 IST
రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ నిల్వలు భారీగా పెరిగాయని, వాటిని సకాలంలో ఉపయోగించేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ విషయంలో
- ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం
చెన్నై: రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ నిల్వలు భారీగా పెరిగాయని, వాటిని సకాలంలో ఉపయోగించేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ విషయంలో ప్రైవేటు ఆస్పత్రులు, సంస్థలు కలిసి టీకాలను సద్వినియోగం చేయాలని సూచించామన్నారు. స్థానిక ఆరుంబాక్కంలో ఏర్పాటైన ‘నమ్మ కేఫ్’ను మంత్రి సోమవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. నగరంలోని ఈ నమ్మ కేఫ్ 20వ శాఖను నమిత పెరియస్వామి అనే హిజ్రాకు ఇవ్వడం విశేషం. ఈ కార్యక్రమంలో అన్నానగర్ ఎమ్మెల్యే మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోందని, కరోనా కేసుల సంఖ్య రోజుకు వెయ్యికంటే తక్కువగా నమోదవుతుండటం ఆనందించదగిన విషయమ న్నారు. రాష్ట్రంలో 92 శాతం మంది మొదటి విడత టీకాలు, 72 శాతం మంది రెండో విడత టీకాలు వేసుకున్నారని, ఇప్పటివరకూ 9 కోట్ల 88లక్షల 40 వేల 169 మందికి కొవ్యాక్సిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు వేసినట్టు తెలిపారు. ఈ వారంతంలోగా పది కోట్ల టీకాల లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. కోటిమందికి పైగా టీకాలు వేసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందని, టీకా వేసుకుంటే ప్రాణగండం తప్పుతుందనే విషయాన్ని కొంతమంది గుర్తించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 26న 23వ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్లో వ్యాక్సిన్ వేసుకోని వారంతా తప్పకుండా టీకాలు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రప్రభుత్వ విధివిధానాల మేరకు రాష్ట్రానికి కేటాయించే వ్యాక్సిన్లలో 25 శాతం ప్రైవేటు ఆస్పత్రులకు పంపిణీ చేస్తున్నామని, ప్రస్తుతం వాటిలో వేల సంఖ్యలో టీకాలు నిరుపయోగంగా ఉన్నాయని తెలిపారు. కరోనా కేసుల సంఖ్యను ప్రభుత్వం తగ్గించి చూపుతోందంటూ ప్రత్యర్థులు పసలేని విమర్శలు చేస్తున్నారని, కరోనా ప్రత్యేక వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య బాగా తగ్గిపోయిందన్న విషయాన్ని గమనించాలని సూచించారు. గిండిలోని కింగ్ ఇన్స్టిట్యూట్లోని కరోనా ప్రత్యేకవార్డులో 800 పడకలు సిద్ధంగా ఉన్నాయని, ప్రస్తుతం ఆ వార్డులో 20 మంది మాత్రమే చికిత్సపొందుతున్నారని వివరించారు. ఇదే విధంగా రాజీవ్గాంధీ స్మారక ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని కరోనా ప్రత్యేకవార్డులో 2250 పడకలున్నాయని, ఆ వార్డులో 50 మంది బాధితులు మాత్రమే చికిత్స పొందుతున్నారని మంత్రి స్పష్టం చేశారు.