కంచిలో ప్రాచీన శివాలయం

ABN , First Publish Date - 2022-04-12T13:49:38+05:30 IST

కాంచీపురంలో ఓ ప్రాచీన శివాలయం దురాక్రమణలకు గురై ప్రధాన ద్వారం వద్ద టైర్ల పంక్చర్‌షాపు నడుపుతుండటంతో యేళ్ల తరబడి ప్రపంచానికి తెలియకుండా మరుగునపడింది.

కంచిలో ప్రాచీన శివాలయం

- పంక్చర్‌ షాపు వెనుక ఏళ్ల తరబడి మరుగునపడ్డ వైనం  

- మంత్రి శేఖర్‌బాబు తనిఖీ


చెన్నై: కాంచీపురంలో ఓ ప్రాచీన శివాలయం దురాక్రమణలకు గురై ప్రధాన ద్వారం వద్ద టైర్ల పంక్చర్‌షాపు నడుపుతుండటంతో యేళ్ల తరబడి ప్రపంచానికి తెలియకుండా మరుగునపడింది. ఇటీవల హిందూ సంస్థలకు చెందిన ప్రముఖులు ఆ ప్రాచీన ఆలయం వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడంతో కంచి నగరవాసులు దిగ్ర్భాంతి చెందారు. యేళ్ళతరబడి ఆ ప్రాంతంలోనే  నివసిస్తున్నవారంతా అక్కడ ప్రాచీన ఆలయం ఉందని తెలియకపోవడంపై ఆశ్చర్యపోతున్నారు. గత వారం రోజులుగా స్థానికులు పంక్చర్‌ షాపులోపలకు వెళ్ళి ఆ ప్రాచీన ఆలయాన్ని సందర్శిస్తున్నారు. పాడుపడిన స్థితిలో ఉన్న ఆ ఆలయ మధ్యమండపంలో నందీశ్వరుడి విగ్రహం దాని ఎదురుగా ఓ చిన్న గర్భాలయం శివలింగం మాత్రమే ఉండటాన్ని గమనించారు. ఇక ఆలయం నలువైపులా ప్రహారీకి ఆనుకుని ఇళ్లు నిర్మించుకున్నందువల్లే ఆ ఆలయం ఎవరి కంటాపడలేదని స్థానికులు తెలిపారు. పంక్చర్‌ షాపు నడుపుతున్న వ్యక్తి ఆ స్థలమంతా తమదేనని స్థానికులకు తెలిపాడు. ఇలా ఆక్రమణలకు గురైన ఆ ప్రాచీన ఆలయానికి సంబంధించిన వీడియో ప్రసార మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు అదికారులతో కలిసి ఆదివారం అర్థరాత్రి ఆ  ఆలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కాంచీపురం కామరాజర్‌ రోడ్డులో వందేళ్లకు ముందు ఓ భక్తుడు జీవసమాధి చెందిన స్థలంలో ఆలయం ఉన్నట్లు రెవెన్యూ శాఖ రికార్డుల్లో నమోదై ఉందని, ఈ ఆలయానికి సంబంధించి కోర్టులో పలు కేసులున్నాయని, ఇది ప్రైవేటు వ్యక్తులకు చెందినదా? లేక లింగాయచ వర్గీలయులకు చెందినదా? అని దస్తావేజులను పరిశీలించిన తరువాతే ఓ నిర్ణయానికి రాగలమని చెప్పారు. ఈ ఆలయానికి సంబంధించి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కూడా ఉన్నాయని చెబుతున్నారని, వాటిని కూడా దేశాదాయ శాఖ ఉన్నతాధికారులు పరిశీలిస్తారని చెప్పారు. ప్రస్తుతం స్థలాన్ని ఆక్రమించి ఇళ్ళను నిర్మించుకున్నవారే ఆ ఆలయాన్ని నిర్వహిస్తారా? లేక దేవాదాయ శాఖకు అప్పగిస్తే దానికి జీర్ణోద్ధరణ పనులను నిర్వహించి పూర్వవైభవం కల్పించటమా? అనే అంశాలపై రికార్డులన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంచీపురం జిల్లాల్లో ఇప్పటివరకూ రూ.1200 కోట్ల విలువైన ఆలయ స్థలాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. మంత్రితోపాటు కాంచీపురం ఎంపీ సెల్వం, శాసనసభ్యులు కె.సుధాకర్‌, ఎళిలరసన్‌, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ పొన్‌జయరామన్‌, రెవెన్యూ అధికారి శివరుద్రయ్య తదితర అధికారులు ఆ ఆలయస్థలాన్ని తనిఖీ చేశారు.

Updated Date - 2022-04-12T13:49:38+05:30 IST