అర్హులైన రైతులకు ఉచితంగా బోర్లు: మంత్రి ముత్తంశెట్టి
ABN , First Publish Date - 2020-09-29T16:06:58+05:30 IST
జిల్లాలో అర్హులైన సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు మంజూరు చేయనున్నట్టు..
విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అర్హులైన సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు మంజూరు చేయనున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ‘వైఎస్సార్ జలకళ’ ప్రారంభం సందర్భంగా తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి పాల్గొన్న మంత్రి పాల్గొన్నారు. అనంతరం పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన రిగ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి మాట్లాడుతూ బోరు, మోటారు, విద్యుత్ కనెక్షన్ ఉచితమేనని, అర్హులైన రైతులు ఒక్క పైసా చెల్లించనక్కర్లేదన్నారు.
ఒకచోట వేసిన బోరులో నీరు రాకపోతే మరోసారి ఉచితంగానే బోరు వేస్తామన్నారు. అర్హులైన రైతులు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు కన్నబాబురాజు, అన్నంరెడ్డి అదీప్రాజ్, పెట్ల ఉమాశంకర్ గణేష్, కరణం ధర్మశ్రీ, గొల్ల బాబూరావు, కలెక్టర్ వి.వినయ్చంద్, డీసీసీబీ చైర్పర్సన్ ఇన్చార్జి ఉప్పలపాటి సుకుమారవర్మ, డ్వామా పీడీ సందీప్ తదితరులు పాల్గొన్నారు.