HYD : ధరలు పెరుగుతున్నాయ్.. భూములు కాపాడండి : మంత్రి కేటీఆర్
ABN , First Publish Date - 2022-02-20T12:42:08+05:30 IST
ధరలు పెరుగుతున్నాయ్.. భూములు కాపాడండి
హైదరాబాద్ సిటీ : అభివృద్ధి విస్తరణతో భూముల విలువలు అనూహ్యంగా పెరుగుతోన్న దృష్ట్యా, సంస్థ అధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు. చెరువుల పరిరక్షణ, సుందరీకరణకు జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. శనివారం నానక్రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(హెచ్ఆర్జీసీఎల్) కార్యాలయంలో హెచ్ఎండీఏ చేపడుతోన్న మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణపై చర్చించారు.
చెరువుల సుందరీకరణ, అభివృద్ధిపై నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చెరువుల సుందరీకరణ పనులు మరింత ముమ్మరం చేయాలని, ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అతిపెద్దదైన గండిపేట చెరువు వద్ద అభివృద్ధి, పరిరక్షణ పనులను మరింత వేగంగా, విస్తృత స్థాయిలో చేపట్టాల్సిన అవసరముందని మంత్రి పేర్కొన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో రేడియల్ రోడ్ల బలోపేతం, మూసీ ప్రక్షాళన, మూసీపై బ్రిడ్జిల నిర్మాణం, ల్యాండ్ పూలింగ్ ప్రణాళికలు, లాజిస్టిక్ పార్కుల నిర్మాణం పురోగతిపై ఆరా తీస్తూ వివిధ అంశాలకు సంబంధించి స్వల్పకాలిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్, సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.