పంతొమ్మిదేళ్లుగా పాలపొడే అతనికి ఆహారం!
ABN , First Publish Date - 2020-09-19T17:42:22+05:30 IST
తమిళనాడుకు చెందిన ఓ యువకుడు పుట్టినప్పటి నుంచి పౌడర్ పాలనే ఆహారంగా తీసుకుంటున్నాడు. పందొమ్మిదేళ్లుగా బిడ్డ ఆకలి తీర్చిన తండ్రి ప్రస్తుతం కొడుకు పోషించలేక ఆవేదన
చెన్నై(ఆంధ్రజ్యోతి): తమిళనాడుకు చెందిన ఓ యువకుడు పుట్టినప్పటి నుంచి పౌడర్ పాలనే ఆహారంగా తీసుకుంటున్నాడు. పందొమ్మిదేళ్లుగా బిడ్డ ఆకలి తీర్చిన తండ్రి ప్రస్తుతం కొడుకు పోషించలేక ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. తిరువారూరు జిల్లా లక్ష్మాంగుడి గ్రామానికి చెందిన రోజుకూలీ కన్నన్ కుమారుడు కళైయరసన్ (19) ముక్కు, పెదాలు, కనురెప్పలు మూతపడిన స్థితిలో జన్మించాడు. తల్లి మృతి చెందటంతో కన్నన్ పౌడర్ పాలను పట్టించేవాడు. ఎనిమిదేళ్ళ వయస్సులో కళైయరసన్కు సేలం ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి మూసిన పెదాలను, ముక్కును చక్కదిద్దారు. అప్పటి నుంచి అతను అందరిలా మాట్లాడినా.. లోనాలుక శాశ్వతంగా మూసుకుపోవటంతో ఆహారం తినలేడు. ఈ క్రమంలో అతనికి పౌడర్ పాలే ఆహారంగా మారాయి. ఒకవేళ ప్యాకెట్ పాలు పడితే వాంతులు చేసుకుంటాడు. అయితే రోజుకూలీ చేసుకునే కన్నన్ సంపాదన కుమారుడికి పాల పౌడర్ కొనడానికే సరిపోతోంది. దీంతో కుమారుడిని పోషించడం తనకు తలకు మించిన భారంగా మారిందని, తగు సహాయం అందించి కాపాడాలని కన్నన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.