పాల ప్యాకెట్ కోసం వెళ్లిన ఏడేళ్ల చిన్నారి.. భారీ వర్షం కురుస్తుండడంతో.. డ్రైన్లో పడి..
ABN , First Publish Date - 2020-07-13T17:26:57+05:30 IST
ఏడేళ్ల చిన్నారి పాల ప్యాకెట్ కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ..
మండపేట(తూర్పు గోదావరి): ఏడేళ్ల చిన్నారి పాల ప్యాకెట్ కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ సీసీ డ్రైన్లో పడి ప్రాణాలు వదిలింది. మండపేట పట్టణ ఎస్.ఐ రాజేష్ కుమార్ వివరాల ప్రకారం.. స్థానిక ఐదోవార్డులో సుమేధ పాఠశాల వద్ద ఉంటున్న వలివెల సుధాకర్, పల్లవి దంపతుల కుమార్తె సూర్యచంద్రకళ. ఆదివారం పల్లవి కుమార్తెను పాలప్యాకెట్ కోసం దుకాణానికి పంపించింది. అప్పటికే భారీ వర్షం కురుస్తుండడంతో నిర్మాణంలో ఉన్న సీసీ డ్రైన్లో చిన్నారి జారిపోయి కొట్టుకుపోయింది. కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరకు మురుగునీరు చేరే రాజారత్న బైపాస్ రోడ్డులో పశువులు పాకల వద్ద కనిపించింది. బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు ధ్రువీకరించారు. కుమార్తె మృతితో తల్లితండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్ఐ తెలిపారు.