తెరుచుకోని ప్రభుత్వ పాఠశాలలు

ABN , First Publish Date - 2020-12-05T05:37:44+05:30 IST

జిల్లాలో కొన్ని చోట్ల ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వ పాఠశాలలు మూతవేశారని, దీంతో 14 మంది ఉపాధ్యాయులకు నోటీసులు జారీచేశామని డీఈవో శైలజ తెలిపారు.

తెరుచుకోని ప్రభుత్వ పాఠశాలలు
కడపలో శుక్రవారం మూతబడిన ఎంపీపీ పాఠశాలను చూస్తున్న డీఈవో శైలజ

14 మంది ఉపాధ్యాయులకు నోటీసులు

కడప (ఎడ్యుకేషన్‌), డిసెంబరు 4: జిల్లాలో కొన్ని చోట్ల ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వ పాఠశాలలు మూతవేశారని, దీంతో 14 మంది ఉపాధ్యాయులకు నోటీసులు జారీచేశామని డీఈవో శైలజ తెలిపారు. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా పాఠశాలలు మూసివేయడం నిబంధనలకు విరుద్ధమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె కడప, చెన్నూరు, ఖాజీపేట, మైదుకూరు మండలాల్లో ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఖాజీపేట మండలం అప్పనపల్లె ప్రాథమిక పాఠశాలను ఎటువంటి అనుమతులు తీసుకోకుండా మూసియడంతో ఇద్దరు ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేశారు. అలాగే కడప ఆలంఖాన్‌పల్లె జడ్పీ హైస్కూలు, మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల సమయానికి తెరుచుకోకపోవడంతో జడ్పీ పాఠశాలలో పది మంది ఉపాధ్యాయులకు, ఎంపీపీ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో కొంతమంది ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఆలంఖాన్‌పల్లెలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా వారికి ఇష్టమైన సమయంలో పాఠశాలకు వస్తున్నారని అన్నారు. ఇలా అయితే విద్యార్థులు ఎలా వస్తారని ప్రశ్నించారు. మొత్తం 14 మందికి నోటీసులు ఇచ్చామని తెలిపారు.

Updated Date - 2020-12-05T05:37:44+05:30 IST