ప్రతి ఇంటిలో వైద్య పరీక్షలు
ABN , First Publish Date - 2020-03-31T10:19:06+05:30 IST
కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. శ్రీకాకుళం కార్పొరేషన్లో ప్రతి డివిజన్కు ఒక వైద్యుడిని, మునిసిపాలిటీల పరిధిలో మూడు వార్డులకు ఒక వైద్యుడి చొప్పున
శ్రీకాకుళంలో డివిజన్కు ఒకరు
మునిసిపాలిటీల్లో మూడు వార్డుల ఒక్కొక్కరు చొప్పున వైద్యుల నియామకం
ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికీ క్వారంటైన్ తప్పనిసరి
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, మార్చి 30)
కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. శ్రీకాకుళం కార్పొరేషన్లో ప్రతి డివిజన్కు ఒక వైద్యుడిని, మునిసిపాలిటీల పరిధిలో మూడు వార్డులకు ఒక వైద్యుడి చొప్పున నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు వైద్యులు తమ డివిజన్, వార్డుల పరిధిలో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై పరీక్షలు చేయనున్నారు. గ్రామాలు, మండలాల్లో కూడా పీహెచ్సీ వైద్యులు, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు ఆరోగ్య పరీక్షలు చేయనున్నారు. జ్వరం, దగ్గు, జలుబు.. ఇతర రోగ లక్షణాలు ఎవరికి ఉన్నా పరీక్షించి చికిత్స అందజేయనున్నారు.
వారి జాబితా సిద్ధం చేయనున్నారు. ఈ వైరస్ బారిన ఎవరూ పడకుండా మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చినవారిలో కరోనా లక్షణాలు ఉన్నా.. లేకున్నా 14రోజుల పాటు నిర్బంధంలో ఉండాల్సిందే. ఈ నిబంధన తెలిసిందే. ఇప్పుడు ప్రొటోకాల్ మారింది. విదేశాల నుంచి వచ్చినవారినే కాదు.. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని కూడా క్వారంటైన్ సెంటర్కు పంపుతున్నారు. తెలంగాణతో పాటు ఇతర జిల్లాల్లో నివాసముంటున్న వారిని జిల్లాకు రప్పించేందుకు ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇందులో భాగంగా సోమవారం రాత్రి జిల్లాకు సుమారు 200 మంది చేరుకోనున్నారు. వీళ్లందరినీ అంబేద్కర్ యూనివర్సిటీ... టెక్కలి ఐతం కళాశాల.. శ్రీకాకుళంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మెన్స్ హాస్టల్, ఉమెన్ హాస్టల్లో ఏర్పాటుచేసిన క్వారంటైన్ సెంటర్లలో 14రోజుల పాటు ఉంచనున్నారు. ప్రస్తుతం ఎచ్చెర్ల అంబేద్కర్ యూనివర్సిటీ క్వారంటైన్ సెంటర్లో 63 మంది, త్రిపుల్ ఐటీలో 124 మంది, టెక్కలి ఐతంలో 56 మంది ఉన్నారు. వీళ్లందరికీ టూత్పేస్టు నుంచి రాత్రి భోజనం వరకు ప్రభుత్వమే ఏర్పాటు చేయాల్సి ఉంది.
కొనసాగుతున్న లాక్డౌన్...
జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతోంది. ఉదయం ఆరు నుంచి 11 గంటల వరకే నిత్యావసరాల నిబంధనలు పెట్టడంతో జనాభా హడావిడి రోడ్లపై కాస్త తగ్గింది. రోడ్లపై పోలీసులు, స్పెషల్ టాస్క్ఫోర్స్.. గస్తీ ముమ్మరం చేశారు. ఇటు ఎస్పీ అమ్మిరెడ్డి.. ఏఎస్పీ, డీఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు సైతం రోడ్లపైనే నిరంతం మకాం వేసి.. ఎక్కడా ఇబ్బంది లేకుండా.. లాక్డౌన్ను పక్కాగా అమలు చేస్తున్నారు.