ఆగ్రహ ‘జ్వాలలు’: అగ్నిపథ్ స్కీమ్‌పై తీవ్ర వ్యతిరేకత

ABN , First Publish Date - 2022-06-16T19:13:45+05:30 IST

రక్షణ దళాల్లో ఉద్యోగ నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై నిరసనలు తీవ్రతరం అవుతున్నాయి. ముఖ్యంగా బిహార్‌లో ఈ నిరసనలు తీవ్ర రూపాన్ని సంతరించుకున్నాయి. నిరసనకారులు భారీ ఎత్తున పోగై రైలు బోగీలకు నిప్పు పెడుతున్నారు..

ఆగ్రహ ‘జ్వాలలు’: అగ్నిపథ్ స్కీమ్‌పై తీవ్ర వ్యతిరేకత

న్యూఢిల్లీ: రక్షణ దళాల్లో ఉద్యోగ నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై నిరసనలు తీవ్రతరం అవుతున్నాయి. ముఖ్యంగా బిహార్‌లో ఈ నిరసనలు తీవ్ర రూపాన్ని సంతరించుకున్నాయి. నిరసనకారులు భారీ ఎత్తున పోగై రైలు బోగీలకు నిప్పు పెడుతున్నారు. రైల్వే స్టేషన్‌లలో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిసనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయగా, పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. భారత సైన్యం, ఇతర రక్షణ దళాల్లో ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందుతూ, సిద్ధమవుతున్నవారు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ప్రారంభమవడం కోసం రెండేళ్ళ నుంచి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న వీరంతా ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఈ నిసనలు భారీగానే కొనసాగుతున్నాయి. యువత రోడ్లపైకి వచ్చి నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ పథకం మంగళవారం ప్రకటించగా.. బుధవారం నుంచి నిరసనలు వెల్లువెత్తాయి.


అగ్నిపథ్ అంటే?

కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని మంగళవారం ప్రకటించింది. త్రివిధ దళాల అధిపతుల సమక్షంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయసుగలవారిని అగ్నివీరులుగా ఎంపిక చేస్తారు. వీరిని నాలుగేళ్ళ తర్వాత విడుదల చేస్తారు. ఆరు నెలలపాటు శిక్షణ ఇస్తారు. ఈ నాలుగేళ్ళ కాలంలో నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు వేతనం చెల్లిస్తారు. జీవిత బీమా వంటి సదుపాయాలను కూడా కల్పిస్తారు. అగ్నివీరులుగా చేరేందుకు మహిళలు కూడా అర్హులే. సైన్యం, నావికా దళం, వాయు సేనలలో దాదాపు 45,000 మందిని నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రిక్రూట్‌మెంట్లు 90 రోజుల్లో ప్రారంభమవుతాయని, మొదటి బ్యాచ్ 2023 జూలైనాటికి సిద్ధమవుతుందని తెలిపింది.


ఎందుకు నిరసన?

ఈ విధంగా స్వల్ప కాలంపాటు కాంట్రాక్టు ప్రాతిపదికపై సైనికులను నియమించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని యువత తప్పుబడుతున్నారు. సైన్యంలో చేరడం కోసం రెండేళ్ళ నుంచి శ్రమించి, చదువుకుంటున్నవారు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నూతన పథకం వల్ల తమ దీర్ఘకాలిక అవకాశాలు దెబ్బతింటాయని ఆరోపిస్తున్నారు. అగ్నివీరులుగా నియమితులైనవారిలో కేవలం 25 శాతం మంది మాత్రమే తిరిగి రెగ్యులర్ కేడర్‌లో చేరే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఉద్యోగాలివ్వండి, లేదా మమ్మల్ని చంపేయండి’’ వంటి నినాదాలతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-06-16T19:13:45+05:30 IST