వివాహిత ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-07-25T05:26:59+05:30 IST
అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని ముకుందాపురంలో శనివారం చోటు చేసుకుంది.
మునగాల, జూలై 24 : అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని ముకుందాపురంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం ఓర్సు వెంకన్న, సరితలకు 12ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు సాయి, తనుష్ ఉన్నారు. వెంకన్న, సరిత వ్యవసాయం కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం భర్తను పొలం వద్దకు వెళ్లమని చెప్పిన సరిత, ఇంట్లో ఉన్న పిల్లలను బయటకు పంపించింది. బయటకు వెళ్లిన పిల్లలు ఇంట్లోకి వచ్చి చూసే సరికి సరిత(28)ఇంట్లో ఉరివేసుకుని కనిపించింది. వెంటనే సమాచారాన్ని ఇరుగుపొరుగు వారికి చెప్పారు. వారు వచ్చి చూసే సరికి ఆమె మృతి చెందింది. ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.