మన్యంలో అర్హులకు గృహ యోగం
ABN , First Publish Date - 2021-07-25T05:50:04+05:30 IST
పాడేరు, జూలై 24:
తొలి విడత 14,800 ఇళ్లు..
‘ఆంధ్రజ్యోతి’తో గృహ నిర్మాణ శాఖ ఈఈ రఘుభూషణరావు
పాడేరు, జూలై 24: ఏజెన్సీలో అర్హులైన గిరిజనులందరికీ గృహ యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ఎస్.రఘుభూషణరావు వెల్లడించారు. శనివారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. తొలి విడతలో 11 మండలాల్లో 14,800 ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు. పాడేరు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు పది వేలు ఇళ్లు, అరకులోయ నియోజకవర్గంలోని ఆరు మండలాలకు 4,800 ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్మాన్నారు. ప్రస్తుతం లబ్ధిదారులకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇప్పటికి 8,061 మంది లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్ చేశామన్నారు. రిజిస్ట్రేషన్ అనంతరం ప్రభుత్వం నుంచి ఆన్ ప్రొవిజన్ రాగానే ఆయా స్థలాలను జియో ట్యాగింగ్ చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. ఇదిలా ఉండగా గతంలో గిరిజనులు అసంపూర్తి వదిలేసిన 587 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేలా వారిని ప్రోత్సహిస్తున్నామని, సకాలంలో బిల్లులు చెల్లింపులు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
32,392 ఇళ్లు మంజూరుకు ప్రతిపాదనలు
ఏజెన్సీలో 32,932 ఇళ్లు మంజూరు చేయాలని ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ఎస్.రఘుభూషణరావు తెలిపారు. ఏజెన్సీ వ్యాప్తంగా 49 లేఅవుట్ల్లో 1.091 మందికి, గ్రామకంఠాలకు చెందిన భూముల్లో 14,447 మందికి, 15,584 మందికి ఎల్సీపీలను అధికారులు మంజూరు చేశారన్నారు. ప్రస్తుతం ఏజెన్సీకి 14,800 ఇళ్లు మాత్రమే మంజూరు కావడంతో, మరో 32,392 ఇళ్లు అవసరమని, వాటిని మంజూరు చేయాలని ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు సమర్పించారన్నారు. మరో రెండు వారాల్లో అవి మంజూరవుతాయని హౌసింగ్ ఈఈ రఘుభూషణరావు తెలిపారు. లబ్ధిదారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.