ఐఆర్సీటీసీ వైబ్సైట్లో కనిపించని క్లోన్ ట్రైన్లు... స్పందించని హెల్ప్ డెస్క్!
ABN , First Publish Date - 2020-09-20T12:53:35+05:30 IST
రేపటి నుంచి (సెప్టెబరు 21, సోమవారం) నుంచి క్లోన్ ట్రైన్లు నడవనున్నాయి. గతవారంలో రైల్వేశాఖ ఈ రైళ్ల గురించిన సమాచారాన్ని తెలియజేసింది.
న్యూఢిల్లీ: రేపటి నుంచి (సెప్టెబరు 21, సోమవారం) నుంచి క్లోన్ ట్రైన్లు నడవనున్నాయి. గతవారంలో రైల్వేశాఖ ఈ రైళ్ల గురించిన సమాచారాన్ని తెలియజేసింది. శనివారం నుంచి ఈ రైళ్లకు సంబంధించి ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని కూడా ప్రకటించింది. అయితే ఐఆర్సీటీసీ వెబ్సైట్లో పలు క్లోన్ ట్రైన్స్ వివరాలు శనివారం సాయంత్రం నాటికే మాయమయ్యాయి. దీంతో రైళ్ల టిక్కెట్లు బుక్ చేసుకుందామనుకున్న ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఐఆర్సీటీసీకి చెందిన ‘దిశ’ ఆన్లైన్ హెల్ప్లైన్ డెస్క్ దగ్గర కూడా దీనికి సంబంధించిన సమాచారం లేకపోవడం గమనార్హం.
రైల్వే బోర్డు ప్రయాణికుల సౌకర్యార్థం 19 క్లోన్ ట్రైన్స్ నడపనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఈ రైళ్లు పలు మార్గాలలో సెప్టెబరు 21 నుంచి నడుస్తాయని తెలిపింది. అయితే శనివారం సాయంత్రం వరకూ ఆన్లైన్ చెకింగ్ చేసినపుడు ఈ రైళ్ల బుకింగ్కు సంబంధించిన ఆప్షన్ కనిపించలేదు. కాన్పూర్, గోరఖ్పూర్ తదితర రూట్లలో నడిచే ఢిల్లీ-సహరసా స్పెషల్ క్లోన్ ట్రైన్ ఐఆర్సీటీసీ వెబ్సైట్లో కనిపించలేదు. ఇదే విధంగా వారణాసి, లక్నో రూట్లో నడిచే న్యూఢిల్లీ- రాజరీర్ క్లోన్ ట్రైన్ టిక్కెట్ బుకింగ్ కూడా వైబ్సైట్ ద్వారా సాధ్యం కాలేదు. దీనిపై రైల్వేశాఖ ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.