మందుబాబుల గోల
ABN , First Publish Date - 2022-04-29T04:46:34+05:30 IST
పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని గాంధీనగర్, జర్నలిస్ట్ కాలనీ ప్రాంతాల్లో మందుబాబుల గోలతో ఆ ప్రాంతీయులు ఇబ్బందులు పడుతున్నారు. చీకటిపడితే చాలు ఈ ప్రాంతానికి మందు బాబులు చేరిపోయి పీకలదాకా తాగి ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
రైల్వేస్టేషన్, గాంధీనగర్, జర్నలిస్ట్ కాలనీల్లో ఇదీ తంతు
రాజంపేట, ఏప్రిల్ 28: పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని గాంధీనగర్, జర్నలిస్ట్ కాలనీ ప్రాంతాల్లో మందుబాబుల గోలతో ఆ ప్రాంతీయులు ఇబ్బందులు పడుతున్నారు. చీకటిపడితే చాలు ఈ ప్రాంతానికి మందు బాబులు చేరిపోయి పీకలదాకా తాగి ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాజంపేట రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వేట్రాక్కు ఇరువైపులా ఇటు గాంధీనగర్, అటు జర్నలిస్ట్ కాలనీ ప్రాంతాల్లో బిడువు జాగా ఎక్కువగా ఉంది. ఇక్కడ జనసంచారం తక్కువ. పైగా పోలీసుల తాకిడి ఉండదు. ఇది అదునుగా చూసుకొని మందుబాబులు సాయంత్రం చీకటి పడగానే గుంపులు గుంపులుగా ఇక్కడికి చేరిపోతున్నారు. తమకు కావాల్సిన మద్యాన్ని తెచ్చుకొని పీకలదాకా తాగుతూ ఒకరికొకరు పోట్లాడుకుంటూ గోల చేస్తూ అటువైపు వెళ్లేవారిని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. దీంతో ప్రధానంగా మహిళలు అటువైపు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మామూలుగా ఆరుబయట తాగడం పోలీసుల నిబంధనల ప్రకారం చట్టరీత్యా నేరం. వీరిపై కేసులు కూడా నమోదు చేయవచ్చు. స్థానికంగా నివాసం ఉండేవారికి వీరి వల్ల ఎంతో ఇబ్బంది కలుగుతున్నందున పోలీసులు తగిన చర్యలు తీసుకొని ఈ ప్రాంతంలోని మందు బాబులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.