గుడ్లూరు మండలంలోనే విమానాశ్రయం
ABN , First Publish Date - 2022-09-28T04:54:35+05:30 IST
గుడ్లూరు మండలంలో జాతీయ రహదారి పక్కన రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా విమానశ్రయం ఏర్పాటు కోసం తెట్టు, శాంతినగర్, అలాగే మోచర్ల, వీరేపల్లి మధ్య ఉన్న అటవీశాఖ భూములను కలెక్టర్ చక్రధర్బాబు, కందుకూరు ఆర్డీవో సుబ్బారెడ్డి పరిశీలించారు.
అటవీ భూములను పరిశీలించిన కలెక్టర్
గుడ్లూరు, సెప్టెంబరు 27 : గుడ్లూరు మండలంలో జాతీయ రహదారి పక్కన రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా విమానశ్రయం ఏర్పాటు కోసం తెట్టు, శాంతినగర్, అలాగే మోచర్ల, వీరేపల్లి మధ్య ఉన్న అటవీశాఖ భూములను కలెక్టర్ చక్రధర్బాబు, కందుకూరు ఆర్డీవో సుబ్బారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెట్టు, శాంతినగర్ గ్రామాల మధ్య 1000 ఎకరాలు, మోచర్ల - వీరేపల్లి మధ్య మరో 2 వేల ఎకరాల అటవీ భూములను పరిశీలించినట్లు తెలిపారు. ఈ భూములను కేంద్ర నిపుణుల ద్వారా మరోసారి పరిశీలించి, విమానాశ్రయానికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. రామాపట్నం పోర్టుకు అనుబంధంగా ఏర్పాటు కానున్న ఈ విమానాశ్రయం ద్వారా నెల్లూరు జిల్లాతోపాటు చుట్టుపక్కల ప్రదేశాలు అభివృద్ధి సాధించగలవని అన్నారు. తొలుత మోచర్ల గ్రామ సచివాలయ కేంద్రంలో రికార్డులను పరిశీలించిన కలెక్టర్ ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా సమయపాలన పాటించాలని సూచించారు. ప్రజల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గుడ్లూరు తహసీల్దారు లావణ్య తదితరులు పాల్గొన్నారు.