Manamadurai సమీపంలో కారు ప్రమాదం...
ABN , First Publish Date - 2021-11-22T17:31:40+05:30 IST
శివగంగ జిల్లా మానామదురై వద్ద ఆదివారం ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో హోటల్ యజమాని కుమార్తె సహా ఇద్దరు మృతి చెందారు. తొమ్మిదిమంది గాయపడ్డారు. కోయంబత్తూరులో అయ్యప్పన్ (45), దేవి (37) అనే భార్యాభర్తలు
హోటల్ యజమాని కుమార్తె సహా ఇద్దరి మృతి
చెన్నై: శివగంగ జిల్లా మానామదురై వద్ద ఆదివారం ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో హోటల్ యజమాని కుమార్తె సహా ఇద్దరు మృతి చెందారు. తొమ్మిదిమంది గాయపడ్డారు. కోయంబత్తూరులో అయ్యప్పన్ (45), దేవి (37) అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరికి గిరిజ (18), హారతి (17) అనే కుమార్తెలు, తిరుమలై (16) అనే కుమారుడు ఉన్నారు. అయ్యప్పన్ కోయంబత్తూరు సమీపం చేరన్మహానగర్లో హోటల్ నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో అయ్యప్పన్ కుటుంబ సమేతంగా తన స్వస్థలమైన మానామదురై తాయ్మంగళంలోని ముత్తుమారియమ్మన్ ఆలయాన్ని సందర్శించాలని అనుకున్నారు. శనివారం రాత్రి కారులో అయ్యప్పన్, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు తొమ్మిదిమందిని వెంటబెట్టుకుని మానామదురైకి బయలుదేరారు. ఆ కారును అయ్యపన్ బంధువు కుమార్ నడిపాడు. ఆదివారం ఉదయం 6.30 గంటలకు ఆ కారు మాంగుళం విళక్కు అనే ప్రాంతం వద్ద వెళుతుండగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న లోతైన గుంతలో పడింది. ఈ సంఘటనలో అయ్యప్పన్ కుమార్తె ఆరతి, అతడి బంధువు పాండి తీవ్రంగా గాయపడి ఆ స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. అయ్యప్పన్, ఆయన భార్య దేవి, కుమార్తె గిరిజ, కుమారుడు తిరుమలై, బంధువులు మదిఅళగన్, ఆయన కుమారుడు కుమార్, తిరుజ్ఞానం, వేల్మురుగన్, కార్తీక తీవ్రంగా గాయపడ్డారు. కారు గోతిలో పడటాన్ని గమనించిన స్థానికులు పరుగెత్తుకెళ్ళి అందులో చిక్కుకున్నవారిని వెలికి తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుటు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఇరువురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం మానామదురై ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అందరినీ మెరుగైన చికిత్స కోసం మదురై ఆస్పత్రికి తరలించారు. మానామదురై సిప్కాట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.