ట్రాఫిక్ కష్టాలతో ఫ్రస్ట్రేషన్.. ఆ వ్యక్తి చేసిన ఫన్నీ ట్వీట్ ఎంత వైరల్గా మారిందంటే..
ABN , First Publish Date - 2022-06-04T20:54:30+05:30 IST
మహానగరాల్లో ట్రాఫిక్ కష్టాలు ఏ స్థాయిలో ఉంటాయో అక్కడి వాహన చోదకులకు అనుభవమే
మహానగరాల్లో ట్రాఫిక్ కష్టాలు ఏ స్థాయిలో ఉంటాయో అక్కడి వాహన చోదకులకు అనుభవమే. ట్రాఫిక్ జామ్ అయితే గంటల తరబడి రోడ్లపైనే ఉండి పోవాల్సి ఉంటుంది. దేశంలో ముంబై తర్వాత ఆ స్థాయిలో ఎక్కువ సంఖ్యలో వాహనాలు ఉన్న నగరం బెంగళూరు. చుట్టూ వాహనాలు ఉండగా రోడ్డుపై ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయిన ఓ వ్యక్తి ట్విటర్ ద్వారా తన అసహనాన్ని వెల్లగక్కాడు. శ్రీకాంత్ అనే పేరు గల వ్యక్తి బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
`బెంగళూరులోని మా స్నేహితుడు తన కారులోని మూడు, నాలుగు, ఐదు గేర్లను అమ్మెయ్యాలనుకుంటున్నాడు. ఆ గేర్లను అతను ఇప్పటివరకు వాడలేదు. అవి షోరూమ్ కండిషన్లో ఉన్నాయి. బెంగళూరులో ఎవరైనా కొనేవారు ఉన్నారా?` అని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్రాఫిక్ కష్టాలను ఎంతో క్రియేటివ్గా చెప్పడంతో ఎంతో మంది ఆ ట్వీట్పై లైక్ల వర్షం కురిపించారు. ట్రాఫిక్ కష్టాలతో విసిగిపోయిన చాలా మంది ఆ ట్వీట్కు రిప్లైగా తమ బాధలు చెప్పుకున్నారు.