Mamata Banerjee: యూపీతో పోల్చి మా ఇమేజ్ తీయొద్దు
ABN , First Publish Date - 2021-07-15T22:10:32+05:30 IST
Mamata Banerjee: యూపీతో పోల్చి మా ఇమేజ్ తీయొద్దు
కోల్కతా: దేశంలో శాంతిభద్రతలు అత్యంత దారుణంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అని, బెంగాల్వైపు చూసే ముందు యూపీ సంగతేంటో చూడాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హితవు పలికారు. బెంగాల్లో శాంతిభద్రతలు అమలులో లేవని భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆమె మండిపడ్డారు. ఈ విషయమై రాష్ట్ర రాజధాని కోల్కతాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ మోదీ, యోగి ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.
‘‘ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతలు ఎలాంటి పరిస్థితులో ఉన్నాయో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బాగా తెలుసు. ఆ రాష్ట్రంలో ప్రతిరోజు మానవ హక్కుల హననం జరుగుతూనే ఉంటుంది. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదు. హత్రాస్ ఘటన నుంచి ఉన్నావ్ సంఘటన వరకు ఎన్నో ఎన్నెన్నో దారుణాలు రాష్ట్రంలో జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. జర్నలిస్టులకు కూడా అక్కడ భద్రత లేదు. కానీ భారతీయ జనతా పార్టీ నేతలు బెంగాల్లో శాంతిభద్రతల సమస్యలపై మాట్లాడుతున్నారు. యూపీని చూపించి బెంగాల్ ఇమేజ్ను పాడు చేయొద్దు’’ అని మమత అన్నారు.