రాష్ట్రంలో రాక్షస పాలన

ABN , First Publish Date - 2020-09-29T18:13:50+05:30 IST

సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ప్రభుత్వ తప్పొప్పులను..

రాష్ట్రంలో రాక్షస పాలన

వైసీపీ పెత్తందారి పార్టీ 

వెలిగొండ నిర్వాసితులకు రూ.12.50 లక్షలు 

గండికోట నిర్వాసితులకు రూ.10 లక్షలా ? 

బాబు భరోసా పేరిట పార్టీని బలోపేతం చేస్తా  

కడప పార్లమెంటు అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి


కడప(ఆంధ్రజ్యోతి): సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ప్రభుత్వ తప్పొప్పులను ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ పెత్తందారి పార్టీ అని బడుగు, బలహీనవర్గాలను తొక్కేస్తోందని విమర్శించారు.


ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.12.50 లక్షలు నష్టపరిహారం ఇచ్చారని, అదే సీఎం సొంత జిల్లాలోని గండికోట నిర్వాసితులకు మాత్రం రూ.10 లక్షలు ఇస్తూ సొంత జిల్లావాసులకే అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఒక్క ఛాన్స్‌ పేరుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. నీరు-చెట్టు బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.


నాయకులు పార్టీని వీడినంత మాత్రాన టీడీపీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. బాబు భరోసా కార్యక్రమం పేరిట జిల్లాలో పార్టీని బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకువస్తానని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు హరిప్రసాద్‌, అమీర్‌బాబు, గోవర్ధన్‌రెడ్డి, వికా్‌సహరి, పీరయ్య, జిలానీబాషా, రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లింగారెడ్డిని సన్మానించారు.

Updated Date - 2020-09-29T18:13:50+05:30 IST