ముంబై సిటీసెంటర్ మాల్లో ఘోర అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2020-10-23T12:16:31+05:30 IST
దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరంలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం...
ముంబై (మహారాష్ట్ర): దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరంలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ముంబైలోని సిటీసెంటర్ మాల్ లో గురువారం రాత్రి మంటలు చెలరేగాయి. కింది అంతస్తులో రాజుకున్న మంటలు వ్యాపించాయి. దీంతో హుటాహుటిన 20 అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను ఆర్పారు. అగ్నిప్రమాదం జరిగినపుడు సిటీసెంటరుమాల్ లో 300 మంది దాకా ఉన్నారని పోలీసులు చెప్పారు. మంటలను ఆర్పుతుండగా ఓ ఫైర్ మెన్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఫైర్ మెన్ ను ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ముందు లెవెల్ 1లో రాజుకున్న మంటలు మూడు అంతస్తులకు వ్యాపించాయి. ముందుజాగ్రత్త చర్యగా సిటీసెంటరు మాల్ చుట్టుపక్కల ఉన్న భవనాలను ఖాళీ చేయించారు. సిటీసెంటరు మాల్ లో ఉన్న 300మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు మంటలు అదుపులోకి రాలేదు.ఈ మాల్ లో మొబైల్ ఫోన్ల యాక్ససరీలు విక్రయిస్తుంటారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. ముంబైలో గురువారం రెండు అగ్నిప్రమాదాలు జరిగాయి. కుర్లా వెస్ట్ ప్రాంతంలోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది.