Mahua Moitra: స్పెక్టమ్ నాశనం లేనిది, అంతటా వ్యాపించినది...ఈసారి భగవద్గీతతో పార్లమెంటుకు వెళ్తా!
ABN , First Publish Date - 2022-09-23T20:59:57+05:30 IST
ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్-2022 పేరుతో కేంద్ర తీసుకువచ్చిన డ్రాఫ్ట్ తెలుసుకోవాలంటే భగవద్గీతను..
న్యూఢిల్లీ: ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్-2022 పేరుతో కేంద్ర తీసుకువచ్చిన డ్రాఫ్ట్ తెలుసుకోవాలంటే భగవద్గీతను (Bhagavad gita) తప్పనిసరిగా చదవాలని టీఎంసీ ఫైర్బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) ట్వీట్ చేశారు. ఈసారి పార్లమెంటు సమావేశాలకు భగవద్గీతతో వెళ్తానని అన్నారు.
స్పెక్ట్రం 'ఆత్మ' అని, ధ్వంసం చేయలేమని డీఓటీ ఇండియా వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ముసాయిదాను ప్రస్తావిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ పేజీని తన ట్వీట్కు జత చేశారు. ''ఇదేమీ ఆధ్యాత్మిక గ్రంథం కాదు. 5వ పేజీలో డీఓటీ-ఇండియా వెబ్సైట్ నోట్. ఈసారి డీఓటీ అధికారులు అభిప్రాయం చెప్పమని అడిగినప్పుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందుకు భగవద్గీతతో వెళ్తాను. ఇది తప్పనిసరిగా చదవాల్సిన గ్రంథం'' అని ఆమె మరో ట్వీట్లో పేర్కొన్నారు. ఆసక్తికరంగా, ఈ ట్వీట్ను తమ పార్లమెంటు సహచరులైన కాంగ్రెస్ నేతలు శశిథరూర్, కార్తీ చిదంబరం, డీఎంకే తమిళచి తంగపాండియన్లకు ట్యాగ్ చేశారు.
నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రం తాజాగా టెలికాం రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇండియన్ టెలీ కమ్యూనికేషన్ బిల్-2022 పేరుతో డ్రాఫ్ట్ను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. కాలం చెల్లిన పాత చట్టాల స్థానంలో కొత్త బిల్లును తీసుకొచ్చేందుకు ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది. కొత్త బిల్లు ఆమోదం పొందితే, పాత చట్టాలైన ఇండియన్ టెలీగ్రాఫ్ యాక్ట్ 1885, వైర్లెస్ టెలీగ్రఫీ యాక్ట్ 1993, టెలీగ్రాఫ్ వైర్స్ యాక్ట్ 1950 రద్దు అవుతాయి. 21వ శతాబ్దానికి అనుగుణంగా కొత్త రూల్స్ను టెలి కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఫ్రేమ్ చేసింది.