మైనారిటీ విద్యకు మహర్దశ
ABN , First Publish Date - 2022-04-30T07:36:24+05:30 IST
జిల్లాలో మైనారిటీ విద్యకు మహర్దశ పట్టబోతోంది.
జిల్లాలో ప్రత్యేక ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం
చించోలి వద్ద సాగుతున్న క్యాంప్స్ భవన నిర్మాణ పనులు
కేజీ టూ పీజీ వరకు విద్యనందించే దిశగా కార్యాచరణ
రూ.50 కోట్లతో చురుకుగా సాగుతున్న పనులు
నిర్మల్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మైనారిటీ విద్యకు మహర్దశ పట్టబోతోంది. రాష్ట్రప్రభుత్వం మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కు భారీగా నిధులు కేటాయించడమే కాకుండా కొ త్త విద్యాసంస్థల ఏర్పాటుకు నడుం బిగించడం నిర్మల్ ప్రాంతానికి వరంగా మారుతోంది. ముఖ్యంగా మంత్రి అల్లో ల ఇంద్రకరణ్రెడ్డి, జిల్లా కలెక్టర్ ము షారఫ్ ఆలీ ఫారూఖీలు నిర్మల్ను మైనారిటీలకు ప్రత్యేక ఎడ్యుకేషన్ హబ్ ను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. దీని కోసం గానూ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇందుకు అనుగుణంగానే స్థానిక చించోలి వద్ద ప్రస్తుతం రూ.50 కోట్లతో చేపట్టిన మైనారిటీ ఎడ్యుకేషన్ క్యాంపస్ భవిష్యత్ తరాలకు ఉన్నత స్థాయి విద్యను అందించబోతోందంటున్నారు. ఇక్కడి చించోలి వద్ద ప్రస్తుతం బాలురు, బాలికలకు అవసరమయ్యే హాస్టల్లు, అలాగే హైస్కూల్, ఇంటర్మీడియట్ స్థాయిలో బోధన అందించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ భవన నిర్మాణాలపై ప్రత్యేకదృష్టి సారిస్తున్న కారణంగా పనులు వేగం గా సాగుతున్నాయంటున్నారు. మొత్తం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణంతో పాటు హాస్టల్ భవనాన్ని అలాగే మైనార్టీ బాలికల హాస్టల్, బాలికల కాలేజీని నిర్మించనున్నారు. జిల్లాకేంద్రంలో బాలురు, బాలికలకు సంబంధించిన హైస్కూల్స్థాయి విద్యతో పాటు కాలేజీ విద్యకోసం కూడా ఏర్పాట్లు చేశారు. నిర్మల్లో బాలికలు, భైంసా, ఖానాపూర్, ముథోల్లో బాలురు, ముథోల్లో బాలికల విద్యాసంస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కలెక్టర్ పలుసార్లు ఇక్కడి మైనారిటీ ఎడ్యుకేషన్ హబ్ ప్రాంగణాన్ని సందర్శించి సంబంధిత యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సైతం ఇటీవల మైనారిటీ ఎడ్యుకేషన్ క్యాంపస్ను సందర్శించారు. ఏళ్ల నుంచి మైనారిటీలకు సామాజిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారిందన్న వాదనలున్నాయి. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచే మైనారిటీ సంక్షేమం, విద్య, మౌలిక సౌకర్యాల కల్పన లాంటి అంశాలకు ప్రాధాన్యత నిచ్చింది. ముఖ్యంగా నిర్మల్ జిల్లా లో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలపై ప్రత్యేకదృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఆయన గ తంలో ఎన్నడూ లేని విధంగా ప్ర భుత్వం ద్వారా మైనారిటీ శాఖకు భారీగా నిధులను విడుదల చేయించారు. దీంతో చించోలి వద్ద దాదాపు పది ఎకరాలకు పైగా భూమిని సే కరించి అక్కడి నిర్మాణ పనులను చేపట్టారు.
స్పెషల్ క్యాంపస్ నిర్మాణం
మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన ఉన్నతస్థాయి విద్యను ఉచితంగా అందించేందు కోసం ప్రభుత్వం పెద్దమొత్తంలో నిధులను మంజూరు చేయడం ఇక్కడి మైనారిటీ విద్యారంగానికి శుభసూచకమవుతోంది. మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ ప్రత్యేక చొర వ తీసుకొని నిధులు, పనులపై దృష్టి కేంద్రీకరించారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఎప్పటికప్పుడు ప్రభుత్వం ద్వారా నిధులను విడుదల చేయించడం, కలెక్టర్ పనుల పర్యవేక్షణ సాగించడంతో ప్రస్తుతం చించోలి వద్ద భారీ మైనారిటీ ఎడ్యుకేషన్ క్యాంపస్ ఆవిర్భవించింది. ఈ క్యాంపస్ను మాడ్రన్ ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దేందు కోసం సంబంధిత అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్యాంపస్లో బాలురకు, బాలికలకు వేరువేరుగా హాస్టల్ భవనాలను నిర్మిస్తున్నారు. అలాగే బాలురు, బాలికలకు వేరువేరుగా పాఠశాల భవనాలను ఏర్పాటు చేస్తున్నారు.
కొత్త హంగులతో
మైనారిటీ విద్యాసంస్థలలో విద్యార్థుల కోసం ఆధునిక సౌకర్యాలను సమకూరుస్తున్నారు. ముఖ్యంగా టెక్నికల్ ఎడ్యుకేషన్కు సంబంధించి ప్రాధాన్యత కల్పించబోతున్నారు. విద్యార్థులకు సాధారణ విద్యతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాలపై కూడా పట్టు పెంపొందించేందు కోసం టెక్నికల్ ఎడ్యుకేషన్ను అందించనున్నారు. యూనివర్సిటీ తరహాలో ఈ మై నారిటీ ఎడ్యుకేషన్ క్యాంపస్ను నిర్మిస్తున్నారు. ఈ విద్యాసంస్థల్లో భోధిం చే టీచర్లకు కూడా వసతిసౌకర్యం కల్పించేందుకు క్వార్టర్లను నిర్మిస్తున్నారు. విద్యార్థి ప్రాథమికస్థాయి నుంచి ఉన్నతస్థాయి విద్యను పొందే వరకు వారికి ఇక్కడే ఉచితవసతిని, విద్యాబోధనను అందించనున్నారు.
భారీగా నిధులు
కాగా మైనారిటీ సంక్షేమానికి భారీగా నిధులు విడుదలవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇప్పటికే మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ భవన నిర్మాణాలకు ప్రభుత్వం దాదాపు రూ.100 కోట్ల మేరకు నిధులను మంజూరు చేసింది. ఇక్కడి చించోలి వద్ద కనివిని ఎరుగని రీతిలో విద్యాసంస్థల భవనాల నిర్మాణాలు చురుకుగా సాగుతున్నాయి. నిర్మాణ పనులకు ఎప్పటికప్పుడు నిధులు విడుదలవుతున్న కా రణంగా పనుల్లో జాప్యం జరగడం లేదు. చించోలి వద్ద నిర్మిస్తున్న మైనారిటీ ఎడ్యుకేషన్ క్యాంపస్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవబోతోందని సంబందిత అధికారులు వెల్లడిస్తున్నారు.
మైనారిటీలకు ఉన్నత స్థాయివిద్య
చించోలి వద్ద నిర్మిస్తున్న మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మైనారిటీలకు వరం కాబోతున్నాయి. ఈ ప్రాంగణంలో బాలురు, బాలికలకు వేరువేరుగా వసతిసౌకర్యం కల్పించి విద్యా బోధనను అందించనున్నాం. ఎక్కడ కూడా నిధుల కొరత లేదు. మైనారిటీలంతా విద్యకు చేరువ కావాలన్నదే ప్రభుత్వలక్ష్యం. విద్యతోనే పేదరికం దూరమై ఆర్థికంగా, సామాజికంగా ముందుకు సాగవచ్చు.
- ముషారఫ్ ఆలీ ఫారూఖీ, కలెక్టర్, నిర్మల్ జిల్లా