కొవిడ్-19: మహరాష్ట్రలో ఐదు జైళ్లు మూసివేత

ABN , First Publish Date - 2020-04-10T18:53:56+05:30 IST

కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మరిన్ని చర్యలు చేపట్టింది...

కొవిడ్-19: మహరాష్ట్రలో ఐదు జైళ్లు మూసివేత

ముంబై: కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు  మహారాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మరిన్ని చర్యలు చేపట్టింది. ముంబై, పుణే ప్రాంతంలోని మొత్తం ఐదు జైళ్లను మూసివేసింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వీటిని తెరవొద్దంటూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్ విధించిన జైళ్ల జాబితాలో ముంబై సెంట్రల్ జైలు, థానే జైలు, యరవాడ జైల్, బైకుల్లా జైల్, కల్యాణ్ జైల్ తదితర కారాగారాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కొత్తగా ఖైదీలెవరూ లోపలికి వెళ్లడానికి గానీ, లోపలి నుంచి ఎవరూ బయటికి వచ్చేందుకు అనుమతి ఉండదు. కాగా మహారాష్ట్రలో ఇప్పటి వరకు 1,364 మందికి కోవిడ్-19 సోకినట్టు గుర్తించారు. వీరిలో 125 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా... ఈ మహమ్మారి కారణంగా 97 మంది చనిపోయారు. 


కాగా దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య ఇవాళ 6,412కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గత 12 గంటల్లోనే 547 మంది కరోనా బారిన పడినట్టు గుర్తించామని తెలిపింది. 

Updated Date - 2020-04-10T18:53:56+05:30 IST