గుడి నిర్మాణ కమిటీ చీఫ్ మోదీ సన్నిహితుడు
ABN , First Publish Date - 2020-02-20T09:30:19+05:30 IST
రామజన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహంత్ నృత్యగోపాల్ దాస్ రామమందిర నిర్మాణ ట్రస్టు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చంపత్ రాయ్ను ప్రధాన కార్యదర్శిగా
రామాలయ ట్రస్టు అధ్యక్షుడిగా నృత్యగోపాల్ దాస్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: రామజన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహంత్ నృత్యగోపాల్ దాస్ రామమందిర నిర్మాణ ట్రస్టు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చంపత్ రాయ్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ట్రస్టు ఆలయ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి చీఫ్గా ప్రధాని మోదీ మాజీ ముఖ్యకార్యదర్శి నృపేంద్ర మిశ్రాను ట్రస్టు సభ్యులు ఎన్నుకున్నారు. ట్రస్టు కోశాధికారిగా పుణెకు చెందిన స్వామి గోవింద్దేవ్ గిరి నియమితులయ్యారు. రామమందిర నిర్మాణ పర్యవేక్షణ కోసం కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తొలి సమావేశం బుధవారం ఇక్కడ ఢిల్లీలో జరిగింది. సీనియర్ న్యాయవాది కె. పరాశరన్ నివాసంలో జరిగిన సమావేశంలో ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.
అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు, తగిన విధివిధానాలు రూపొందించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 15 రోజుల తర్వాత అయోధ్యలో ట్రస్టు మళ్లీ సమావేశమై ఆలయ నిర్మాణాన్ని ఆరంభించే తేదీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ట్రస్టు వర్గాలు తెలిపాయి. గుడి నిర్మాణానికి విరాళాల కోసం అయోధ్యలోని ఎస్బీఐ శాఖలో కొత్తగా ఖాతాను ప్రారంభిస్తామని చంపత్ రాయ్ మీడియాకు చెప్పారు. ఈ సమావేశంలో ట్రస్టీలతోపాటు కేంద్ర, యూపీ ప్రభుత్వ ప్రతినిధులు, అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ ఏకే ఝా తదితరులు పాల్గొన్నారు.