ఒంటరిగా ఉన్న వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-05-06T05:07:55+05:30 IST
ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వ్యక్తి చనిపోవడం, రక్తం మడుగు కట్టి ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రక్తం మడుగులో పడివుండడంతో అనుమానాలు
తాటిచెట్లపాలెం, మే 5: ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వ్యక్తి చనిపోవడం, రక్తం మడుగు కట్టి ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంచరపాలెం పోలీసుల కథనం మేరకు...ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న లంకా గణేశ్ కంచరపాలెం లజయ్కల్లాం ప్రాంతంలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఈ ప్రాంతంలో కరోనా కేసులు నమోదు ఎక్కువగా ఉండడంతో కొన్నాళ్ల క్రితం భార్య పావని, పిల్లలను శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అత్తవారింటికి పంపించి వేశాడు. అప్పటి నుంచి ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు.
కాగా, గణేశ్ భార్య పావని మంగళవారం భర్తకు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు రింగ్ అయినా ఎత్తక పోవడంతో అనుమానం వచ్చి పొరుగింటి వారికి ఫోన్ చేసి చూడాల్సిందిగా కోరింది. దీంతో పొరుగింటి వారు గణేశ్ ఇంటికి వెళ్లి చూడగా అతను రక్తం మడుగులో పడివుండడంతో షాక్కు గురయ్యారు. వెంటనే విషయాన్ని పావనికి తెలియజేయగా ఆమె హుటాహుటిన నగరానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. గణేశ్ మృతికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.