బడ్జెట్కు ముందే తగ్గిన వంట గ్యాస్ సిలిండర్ ధరలు
ABN , First Publish Date - 2022-02-01T16:09:52+05:30 IST
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ముందే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రజలకు శుభవార్త వినిపించాయి. ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ధరల్లో ఉపశమనాన్ని కల్పిస్తోంది. రాయితీలు లేనటువంటి, వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ.91.50 వరకు తగ్గింది. అయితే గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వాడకందారులకు ఇటువంటి ఉపశమనం లభించలేదు. ఈ నూతన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి.
రాయితీపై లభించే గృహ వినియోగ ఎల్పీజీ 14.2 కేజీల సిలిండర్ ధర యథావిథిగానే ఉంటుందని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం ప్రకటించాయి. కోల్కతాలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2,076 నుంచి రూ.1,987కు తగ్గింది. ముంబైలో ఈ సిలిండర్ ధర రూ.1,948 నుంచి రూ.1,857కు తగ్గింది.
పెట్రోలు, డీజిల్ ధరలు నవంబరు నుంచి నిలకడగా ఉన్న సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు జరగనున్న సంగతి తెలిసిందే.