బస్‌షెల్టర్‌ను ఢీకొన్న లారీ

ABN , First Publish Date - 2020-11-30T06:43:07+05:30 IST

పాలిష్‌ బండలతో అతివేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి బస్‌షెల్టర్‌ను ఢీకొనడంతో డ్రైవర్‌తోపాటు అక్కడ కాపలాగా ఉన్న ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.

బస్‌షెల్టర్‌ను ఢీకొన్న లారీ
నుజ్జునుజ్జయిన లారీ ముందు భాగం

కాపలా ఉన్న ఇద్దరు పోలీసులు, డ్రైవర్‌కు తీవ్రగాయాలు



కేవీపల్లె, నవంబరు 29: పాలిష్‌ బండలతో అతివేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి బస్‌షెల్టర్‌ను ఢీకొనడంతో డ్రైవర్‌తోపాటు అక్కడ కాపలాగా ఉన్న ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కేవీపల్లె మండలం సొరకాయలపేట వద్ద జరిగింది. వర్షాలకు సొరకాయలపేట చెరువుకు గండి పడగా నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో చెరువు కట్ట మీదుగా వాహనాలు వెళ్లకుండా అక్కడ పోలీసులు కాపలాగా ఉంటున్నారు.  కాగా కడప జిల్లా ఎర్రగుంట్ల నుంచి పాలి్‌షబండలతో వచ్చిన లారీ ఆదివారం తెల్లవారుజామున అదుపుతప్పి సొరకాయలపేట చెరువుకు సమీపంలో ఉన్న బస్‌షెల్టర్‌ను ఢీకొంది. ప్రమాదం ధాటికి బస్‌షెల్టర్‌ కూలిపోయింది. అయితే ఆ సమయంలో బస్‌షెల్టర్‌లో వున్న కానిస్టేబుల్‌ ఆదినారాయణ, హోంగార్డు సుభాస్కర్‌ తీవ్రంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్‌ ఓబుల్‌రెడ్డికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. లారీ వచ్చిన వేగానికి బస్‌షెల్టర్‌ను ఢీకొన్న తర్వాత కూడా ఆగకుండా చెరువుగట్టు వరకూ వెళ్లి అక్కడి రెయిలింగ్‌ను తాకి ఆగిపోయింది.  అక్కడ రెయిలింగ్‌ లేకపోతే లారీ చెరువులోకి దూసుకెళ్లి ప్రమాద తీవ్రత పెరిగి ఉండేదని స్థానికులు తెలిపారు.  క్షతగాత్రులను పీలేరు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించినట్లు ఎస్‌ఐ రామ్మోహన్‌ తెలిపారు. కేసు నమోదు చేసినట్లు చెప్పారు.



Updated Date - 2020-11-30T06:43:07+05:30 IST