ఆగివున్న ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ

ABN , First Publish Date - 2022-05-19T05:49:52+05:30 IST

ఆగివున్న ట్రాక్టర్‌ను టిప్పర్‌ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు గాయపడిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది.

ఆగివున్న ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ

 ఒకరి మృతి.. మరొకరికి గాయాలు

మైలవరం రూరల్‌, మే 18: ఆగివున్న ట్రాక్టర్‌ను టిప్పర్‌ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు గాయపడిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. బొర్రగూడెం గ్రామానికి చెందిన నక్కనబోయిన గోపాలరావు(30), అదే గ్రామానికి చెందిన మరీదు రాఘవులుకు చెందిన మొక్కజొన్నను మైలవరంలోని మార్కెట్‌యార్డుకు ట్రాక్టర్‌లో తరలి స్తుండగా చండ్రగూడెం గ్రామసమీపంలో ట్రాక్టర్‌లో డీజిల్‌ అయిపోయింది. దీంతో ట్రాక్టర్‌ను పక్కన ఆపి గోపాలరావు తన తండ్రికి డీజిల్‌ తీసుకురమ్మని చెప్పాడు. గోపాలరావు, రాఘవులు ఇద్దరు ట్రాక్టర్‌ ముందుభాగంలో కూర్చొని ఉండగా తిరువూరు వైపు నుంచి వస్తున్న టిప్పర్‌ వెనుకవైపు నుంచి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నక్కనబోయిన గోపాలరావు సంఘటనా స్థలంలో మృతిచెందగా, రాఘవులుకు తీవ్రగాయాలయ్యాయి. రాఘవులును మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తర లించి, మెరుగైన వైద్యం కోసం విజయవాడ తీసుకువెళ్లారు. గోపాలరావు మృతదేహానికి పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. ఎస్సై రాంబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. 


 దుర్గాప్రవీణ్‌కుమార్‌ మృతదేహం లభ్యం

జగ్గయ్యపేట రూరల్‌ :  వేదాద్రి వద్ద కృష్ణానదిలో మంగళవారం పడి గల్లంతైన జగ్గయ్యపేటకు చెందిన వేములవాడ దుర్గాప్రవీణ్‌కుమార్‌ (30) మృతదేహం బుధవారం లభ్యమైందని చిల్లకల్లు పోలీసులు తెలిపారు. జగ్గయ్యపేట పట్టణంలోని చెరువు నగర్‌కు చెందిన ఆయన మంగళవారం వేదాద్రి నుంచి కృష్ణానది మీదుగా గుంటూరు జిల్లా గింజుపల్లికి వెళ్తున్న పడవ ఎక్కాడు. నది మధ్యలో పడవపై నుంచి నదిలోకి దూకటంతో పడవ వ్యక్తులు చిల్లకల్లు పోలీసులకు సమాచారం అందించారు. సూసైడ్‌ నోట్‌ ఉండటంతో సమాచారం బంధువులకు తెలిపారు. మృతదేహాన్ని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. 

Updated Date - 2022-05-19T05:49:52+05:30 IST