ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బంది లేకుండా చూడాలి
ABN , First Publish Date - 2020-04-10T11:07:31+05:30 IST
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
కలెక్టర్ కె శశాంక
కరీంనగర్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లాకలెక్టర్ కె.శశాంక అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గన్నీసంచులు, టార్పాలిన్లు, ఎలకా్ట్రనిక్ తూకం యంత్రాలు, తేమ శాతం గుర్తింపు యంత్రాలు రైతు వారి టోకెన్ పంపిణీ, హమాలీ సమస్యలు, కోవిడ్ 19 వ్యాప్తి విషయమై కొనుగోలు కేంద్రాల వద్ద పాటించాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడారు. రైతులు ధాన్యంను కల్లాల్లోనే ఆరబెట్టాలని కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టకూడదన్నారు. టోకెన్ ప్రకారమే రైతులు ధాన్యం తీసుకురావాలన్నారు.
ధాన్యం తీసుకువచ్చే రైతు తమ వెంట ఆధార్కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు ఖాతా పుస్తకం, జిరాక్సులను తప్పకుండా తీసుకు రావాలని సూచించారు. రైతులందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని అన్నారు. ప్రతి గంటకు ఒకసారి సానిటైజర్లు, సబ్బులతో, చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, సహకార అధికారి మనోజ్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి పద్మావతి, జిల్లా మేనేజర్ పౌర సరఫరాల శాఖ శ్రీకాంత్, జిల్లా పౌర సరఫరాల అధికారి సురేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.