లోక్‌సభ నిరవధిక వాయిదా... స్పీకర్ తీవ్ర అసంతృప్తి...

ABN , First Publish Date - 2021-08-11T18:57:38+05:30 IST

లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో కార్యకలాపాలు జరిగిన తీరుపై

లోక్‌సభ నిరవధిక వాయిదా... స్పీకర్ తీవ్ర అసంతృప్తి...

న్యూఢిల్లీ : లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో కార్యకలాపాలు జరిగిన తీరుపై సభాపతి ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సెషన్‌లో ఆశించిన స్థాయిలో కార్యకలాపాలు జరగకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. సభలో గరిష్ఠ స్థాయిలో కార్యకలాపాలు జరిగేవిధంగా, ప్రజలకు సంబంధించిన సమస్యలపై చర్చలు జరిగే విధంగా తాను ఎల్లప్పుడూ కృషి చేశానని చెప్పారు. ఈ సెషన్‌లో సభా కార్యకలాపాలకు నిరంతరం అడ్డంకులు ఎదురయ్యాయన్నారు. గత రెండేళ్ళలో ప్రయోజనకరంగా సభ నడిచిందన్నారు. 


సభలో చర్చలు, అంగీకారాలు, అంగీకరించకపోవడాలూ ఉంటాయని, సభ గౌరవాన్ని ఎన్నడూ తగ్గించలేదని అన్నారు. సభ గౌరవాన్ని ఎంపీలు కాపాడతారని  ఆశిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంటరీ సంప్రదాయాలకు అనుగుణంగా సభా కార్యకలాపాలు సాగే విధంగా సహకరించాలని అందరు ఎంపీలను కోరారు. సభ గౌరవాన్ని కాపాడాలని కోరారు. నినాదాలు చేయడం, బ్యానర్లను ప్రదర్శించడం మన పార్లమెంటరీ సంప్రదాయాలు కాదన్నారు. ఎంపీలు తమ తమ స్థానాల్లో ఉంటూ తమ భావాలను వ్యక్తం చేయాలన్నారు. 


ఈ వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభ కేవలం 74 గంటల 46 నిమిషాలపాటు మాత్రమే కార్యకలాపాలను నిర్వహించిందన్నారు. మొత్తం సఫలత 22 శాతం మాత్రమేనని చెప్పారు. ఈ సమావేశాల్లో 20 బిల్లులు ఆమోదం పొందాయన్నారు. వీటిలో ఓబీసీ బిల్లు అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఆమోదం పొందిందన్నారు. సభా కార్యకలాపాలకు సహకరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, అన్ని పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలిపారు. 


అంతకుముందు లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. జూలై 19న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు షెడ్యూలు ప్రకారం ఆగస్టు 13 వరకు జరగవలసి ఉంది. కానీ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కాసేపటికే సభ నిరవధికంగా వాయిదా పడింది. 


ఈ సమావేశాల్లో ఆమోదం పొందిన బిల్లుల్లో ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్, జనరల్ ఇన్సూరెన్స్, కొబ్బరి బోర్డు, పన్ను చట్టాలు, డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ, ఓబీసీలకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి.


Updated Date - 2021-08-11T18:57:38+05:30 IST