బైక్‌పై కొత్త జంట‌... అడ్డుకున్న‌ పోలీసులు ఏం చేశారంటే...

ABN , First Publish Date - 2021-05-13T15:55:06+05:30 IST

క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న నేప‌ధ్యంలో...

బైక్‌పై కొత్త జంట‌... అడ్డుకున్న‌ పోలీసులు ఏం చేశారంటే...

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న నేప‌ధ్యంలో ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. మ‌రికొన్ని రాష్ట్రాల్లో క‌రోనా క‌ట్ట‌డికి క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప‌రిమిత సంఖ్య‌లో వివాహ వేడుక‌ల‌కు అనుమతిస్తున్నారు. తాజాగా నూత‌న వ‌ధూవ‌రుల‌కు సంబంధించిన ఒక వీడియో వైర‌ల్‌గా మారింది.  ఆ వీడియోలో... కొత్తగా పెళ్ల‌యిన ఒక జంట బైక్‌పై వెళుతూ క‌నిపిస్తోంది. క‌రోనా ప్రోటోకాల్ పాటిస్తూ వ‌రుడు... వధువును బైక్ పై తీసుకువెళ్ల‌డాన్ని గ‌మ‌నించిన పోలీసు అధికారి ఆ నూత‌న దంపతులను అభినందించడమే కాకుండా కానుక‌లు కూడా ఇచ్చారు. 


ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. కాగా ఈ వీడియోలో నూత‌న వధూవరులు తమ పెళ్లి అనంత‌రం బైక్‌పై ఇంటికి వెళుతున్నట్లు క‌నిపిస్తుంది. వారిని చూసిన‌ పోలీసు అధికారులు నూత‌న వ‌ధూవ‌రులిద్ద‌రికీ దండలు వేసి అభినందించారు. అలాగే వారికి కానుక రూపంలో  కొంత డబ్బు కూడా ఇచ్చారు. ఈ వీడియోను మే 11 న ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా షేర్ చేసినప్పటికీ, ఈ ఉదంతం గత సంవత్సరం లాక్‌డౌన్ సమయంలో జరిగింది. అయితే ఇప్పుడు ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. 

                                                యూపీ ఖ‌బ‌రే సౌజ‌న్యంతో....

Updated Date - 2021-05-13T15:55:06+05:30 IST