మరింత కఠినంగా లాక్డౌన్
ABN , First Publish Date - 2020-04-10T05:30:00+05:30 IST
జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో లాక్డౌన్ని మరింత కఠినంగా అమలు చేయాలని కోవిడ్-19 జిల్లా
కోవిడ్-19 జిల్లా ప్రత్యేక అధికారి, బుడితి రాజశేఖర్
గుంటూరు, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో లాక్డౌన్ని మరింత కఠినంగా అమలు చేయాలని కోవిడ్-19 జిల్లా ప్రత్యేక అధికారి, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుడితి రాజశేఖర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్కు వచ్చిన ఆయన మంత్రి మోపిదేవి వెంకటరమణ, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్తో కలిసి అధికారులతో సమీక్షించారు. అంతకముందు ఆయన అధికారులతో కలిసి కంటైన్మెంట్ జోన్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్జోన్లలో ప్రజలెవ్వరూ బయటకు రాకుండా ఇంటి వద్దకే నిత్యావసరాలు సరఫరా చేయాలన్నారు.
ఎవరూ రహదారుల పైకి రాకుండా పోలీసులు అవగాహన కల్పించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎస్పీలు రామకృష్ణ, విజయరావు మాట్లాడుతూ గుంటూరులో పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా 28 రోడ్లను మూసి వేశామని, అత్యవసర, నిత్యవసర సేవల కోసం మూడు మార్గాల్లో అనుమతిస్తున్నామన్నారు. సమావేశంలో జేసీ ఏఎస్ దినేష్కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ దినేష్కుమార్, ట్రైనీ కలెక్టర్ మౌర్య నారపురెడ్డి, జేసీ-2 శ్రీధర్రెడ్డి, డీఆర్వో సత్యన్నారాయణ పాల్గొన్నారు.
ప్రజలు గృహనిర్బంధంలోనే ఉండాలి : మంత్రి మోపిదేవి
జిల్లాలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ప్రజలందరూ స్వీయ గృహనిర్బంధంలోనే ఉండాలని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైరస్ నిర్ధారణకు సంబంధించిన కిట్లు, మాస్కులు, పీపీఈలు, ఇతర రక్షణ పరికరాలు రాష్ట్రంలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయన్నారు.
లాక్డౌన్ పాటించే విషయంలో గ్రామాల్లో ప్రజలు పూర్తిగా సహకరిస్తోన్నారని నగరాల్లో మాత్రం యువకులు అనవసరంగా రహదారులపైకి వస్తూ ఆంక్షలను పాటించకపోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారిందన్నారు. సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్ధాళి గిరిధర్రావు, గుంటూరు మిర్చియార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.