ఏడాదిగా లాక్డౌన్!
ABN , First Publish Date - 2020-06-05T11:18:37+05:30 IST
కరోనా వైరస్తో రెండు నెల లుగా లాక్డౌన్లో..
ఊర్లు దాటని గోదావరి తీర ప్రాంత ప్రజలు
బోటు ప్రయాణాలు రద్దయ్యి ఏడాది పూర్తి
అత్యవసర పరిస్థితుల్లో నాటు పడవలే దిక్కు
బోటు కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకం
జంగారెడ్డిగూడెం(పశ్చిమ గోదావరి): కరోనా వైరస్తో రెండు నెలలుగా లాక్డౌన్లో ఉంటేనే ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అలాంటిది ఏడాది కాలంగా ఈ ఊరు వారంతా లాక్డౌన్లోనే ఉన్నారు. గోదావరి తీర ప్రాంత ప్రజలు గ్రామాలకే పరిమితమయ్యారు. గోదారి దాటేందుకు అవసరమైన బోటు ప్రయాణాలు రద్దవడంతో ఊరి నుంచి కదిలే దారిలేదు. అవసరాలన్నింటికి ఇబ్బందులు పడుతున్నారు. ఇవి ఎప్పటికి తొలుగుతాయో తెలియని అయోమయంలో ఉన్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ పోర్టు అధికారుల ఆదేశాలతో 2019న జూలై 25న బోట్ల ప్రయాణాలు నిలిపివేశారు. తరువాత ఇదే ఏడాది సెప్టెంబరులో కచ్చులూరు వద్ద బోటు ప్రమాదంలో దాదాపు 53 మంది గోదావరి గర్భంలో కలిసి పోయారు. బోటు ప్రయాణాలను రద్దుచేశారు. దీనిపై ఆధారపడి జీవించే సుమారు 500 కుటుంబాల బోటు కార్మికులు ఉపాధి కోల్పోయారు. రెండు జిల్లాల గోదావరి తీర ప్రాంత గ్రామాల వారు గోదావరిపై ప్రయాణాలు సాగిస్తుంటారు.
పశ్చిమ నుంచి సింగనపల్లి, మాధాపురం, తూటికుంట, కోండ్రు కోట, టేకూరు, తెల్లదిబ్బలు తదితర దాదాపు 19 గ్రామాలు ఉన్నాయి. తూర్పు గోదావరి వైపు కొండ మొదలు, అంగులూరు, తాళ్లూరు, కచ్చులూరు తదితర 24 గ్రామాల వారంతా విద్య, వైద్యం, నిత్యావసర సరుకులు, సంతలకు పోలవరానికి బోట్లపై వస్తుంటారు. ఏడాది కాలంగా ఎక్కడకూ వెళ్లే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ వెళ్లాలంటే రోడ్డు ప్రయాణం ద్వారా దాదాపు వందల కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిందే. దీంతో అత్యవసర పరిస్థితుల్లో నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు. నిత్యావసర సరుకులు, వైద్యం కోసం ప్రమాదపు అంచుల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. వర్షాలు పడి గోదావరి ఉరకలేస్తే దాదాపు ఆ గ్రామాలన్నింటికీ బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. బోట్ల పునరుద్ధరణకు కాకినాడ పోర్టు అధికారులు తనిఖీలు జరిపారు. కొన్ని నిబంధనలు విధించారు. ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదు. దీనిపై ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏడాదిగా నిలిచిపోయాయి..
గోదావరిలో ఏడాది కాలంగా లాంచీలు, బోట్ల ప్రయాణాలను అధికారులు నిలిపివేశారు. కాకినాడ పోర్టు అధికారులు బోట్లు ఫిట్నెస్ పరిశీలించిన అనుమతిస్తామన్నారు. పరీక్షలు పూర్తిస్థాయిలో చేయలేదు. అనుమతులు ఇవ్వలేదు. అప్పటి నుంచి గోదావరిలో రాకపోకలు నిలిచిపోయాయి. వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
- షేక్ బాబూ, లాంచి పాటదారుడు, పోలవరం
ఆర్థిక సాయం అందించాలి..
ఏడాది కాలంగా బోటు ప్రయాణాలు నిలిచిపోయాయి. బోట్లపై ఆధారపడి బతికే సుమారు 500 మంది ఉపాధి కోల్పోయారు. అప్పులు చేసుకుని జీవనం సాగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు బోటు అనుమతిలిస్తారా అని ఎదురు చూస్తున్నాం. మాకు ఈ పని తప్ప వేరే పనిరాదు. అధికారులు స్పందించి బోటు కార్మికులకు ఆర్థికసాయం అందించడంతోపాటు అనుమతులు ఇవ్వాలి.
- జి.జీవన్కుమార్(శివ), బోటు కార్మికుడు