ధర తక్కువ.. కిక్కు ఎక్కువ !
ABN , First Publish Date - 2020-08-02T16:26:17+05:30 IST
ప్రభుత్వం మద్యం ధరలను భారీగా పెంచింది. దీనికితోడు లాక్డౌన్ కారణంగా..
రూ.30లకే రెండు మద్యం సీసాల మత్తు
శానిటైజర్లకు బానిసవుతున్న మందుబాబులు
ప్రాణాలు కోల్పోతున్న వైనం
అయినా కళ్లు తెరవని మద్యం ప్రియులు
ఉదయగిరి రూరల్(నెల్లూరు): ప్రభుత్వం మద్యం ధరలను భారీగా పెంచింది. దీనికితోడు లాక్డౌన్ కారణంగా మద్యం అందుబాటులో లేకుండా పోయింది. దీంతో మందుబాబులు శానిటైజర్లకు బానిసలవుతున్నారు. తక్కువ ధరకే ఎక్కువ మత్తు ఇస్తుండడంతో మద్యం కన్నా వాటినే తాగుతూ ఆరోగ్యాలను గుల్ల చేసుకొంటున్నారు. ఇటీవల జిల్లాలో శానిటైజర్ తాగి ఇద్దరు మృతి చెందారు. తాజాగా పొరుగు ఉన్న ప్రకాశం జిల్లాలో 13 మంది మృత్యువాత పడ్డారు. ఈ పరిస్థితుల్లోనూ మందుబాబులు కళ్లు తెరవకపోవడం గమనార్హం.
విపరీతంగా కొనుగోళ్లు
కరోనా కారణంగా లిక్విడ్, జెల్ తదితర శానిటైజర్లు మార్కెట్లోకి వచ్చాయి. ధర అందుబాటులో ఉండడంతో వాటిని మద్యంప్రియులు విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. వాటిలో శీతలపానీయాలు కలుపుకొని సేవిస్తూ మత్తులో జోగుతున్నారు. వీటిని తాగిన కొందరు మృత్యువాతపడుతుం టే మరికొందరు ఆరోగ్యం క్షీణించి వైద్యశాలలకు పరుగులు తీస్తున్నారు.
అల్కహాల్ శాతం ఎక్కువే..
కరోనా నివారణ ఏమోగాని శానిటైజర్లు మద్యం ప్రియులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అల్కహాల్ శాతం అధికంగా ఉండడంతో వీటిని అధికంగా సేవిస్తున్నా రు. సాధారణంగా రూ.180ల విలువ మద్యం సీసాలో 42.8 శాతం అల్కహాల్ ఉంటుంది. రూ.30లు విలువ గల శాని టైజర్ బాటిల్లో సుమారు 95 శాతం అల్కహాల్ ఉంటుంది. కేవలం రూ.30లు వెచ్చిస్తే రెండు మద్యం సీసాల మత్తు వస్తుండడంతో పలువురు మద్యంప్రియులు శానిటైజర్లకు అలవాటు పడుతున్నారు. మద్యం కొనుగోలు చేయలేని రోజు వారి కూలీలు, పేదలు శానిటైజర్లు తాగుతూ తమ ఆరోగ్యాల ను పాడుచేసుకుంటున్నారు.
మృత్యువాత పడుతున్నా..
శానిటైజర్లు తాగి మృత్యువాత పడుతున్నా మద్యం ప్రియులు జంకడంలేదు. లాక్డౌన్లో మద్యం దొరక్క ఏఎస్పేట, మర్రిపాడు మండలాల్లో ఇటీవల ఇద్దరు శానిటైజర్ తాగి మృతిచెందారు. శానిటైజర్ తాగినవారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడం, తిక్కతిక్కగా మాట్లాడడం చేస్తున్నారు. ఈ దృశ్యాలన్నీ పలువురు ప్రత్యక్షంగా చూస్తున్నా దాన్ని తాగడం మాత్రం మానడంలేదు. గతంలో ప్రభుత్వం నివాసాలకు పంపిణీ చేసిన శానిటైజర్లను సైతం మద్యంప్రి యులు విపరీతంగా కొనుగోలు చేసిన సంఘటనలున్నాయి. ఇప్పటికైనా అధికారులు శానిటైజర్ల విక్రయాలు, సేవించే వారిపై నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.