వైఎస్సార్ చేయూతతో కుటుంబాల్లో వెలుగులు
ABN , First Publish Date - 2021-06-23T05:38:57+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ చేయూత పథకం కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని కలెక్టర్ హరికిరణ్, ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డిలు తెలిపారు.
జిల్లాలో 1,11,434 మంది లబ్ధిదారులకు రూ.208.93 కోట్లు
కలెక్టర్ హరికిరణ్
కడప (కలెక్టరేట్), జూన్ 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ చేయూత పథకం కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని కలెక్టర్ హరికిరణ్, ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డిలు తెలిపారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో ఏడాది వైఎస్సార్ చేయూత సాయం మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేశారు. కార్యక్రమానికి కలెక్టరేట్ నుంచి కలెక్టర్, ఎమ్మెల్యే, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య, జాయింట్ కలెక్టర్ ధర్మచంద్రారెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి వీసీ అనంతరం వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రెండో విడతగా జిల్లాలో 1,11,434 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా సాధికారత మంజూరైన రూ.208.93 కోట్ల మెగా చెక్ ను కలెక్టర్, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సంద్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 45-60 ఏళ్ల 1,11,434 మంది వైఎస్సార్ చేయూత కింద రెండో ఏడాది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఒక్కొక్కరికి రూ.18,750లు చొప్పున విడుదల చేశారన్నారు. వైఎస్సార్ చేయూత పథకానికి అర్హులుగా ఉండి ఇంకా లబ్ధి అందని వారికి నెల రోజులు ప్రభుత్వం గడువు ఇచ్చిందని వలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎల్డీఎం చంద్రశేఖర్, జిల్లా అధికారులు మురళీమనోహర్, వెంకటసుబ్బయ్య, జయప్రకాష్, వీరబ్రహ్మం, సెర్ప్ ఉద్యోగులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.