థర్డ్ వేవ్ను సమర్థంగా ఎదుర్కొందాం
ABN , First Publish Date - 2021-06-18T05:09:01+05:30 IST
కొవిడ్ థర్డ్వేవ్ను సమర్థంగా ఎదుర్కోవాలని కలెక్టర్ హరిజవహర్లాల్ తెలిపారు. గురువారం మిమ్స్ కొవిడ్ ఆసుపత్రిలో కరోనా మూడో దశపై అవగాహన సదస్సు నిర్వహించారు.
మిమ్స్ సదస్సులో కలెక్టర్ హరిజవహర్లాల్
నెల్లిమర్ల, జూన్ 17: కొవిడ్ థర్డ్వేవ్ను సమర్థంగా ఎదుర్కోవాలని కలెక్టర్ హరిజవహర్లాల్ తెలిపారు. గురువారం మిమ్స్ కొవిడ్ ఆసుపత్రిలో కరోనా మూడో దశపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ మూడో దశను ఎదుర్కోవడానికి ప్రతి ఇంట్లో ఒకరు వైద్యుడిలా మారాలని తెలిపారు. కరోనా వైద్యం, మందులు, నివారణ పద్ధతులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఒకటో దశలో కన్నా రెండో దశలో ఎంతోమందిని కోల్పోయామని, 3వ దశలో ఆ పరిస్థితి రాకుండా చూడాలన్నారు. పరిణామాలను ముందుగానే ఊహించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలని, పిల్లలకు అందించబోయే వైద్య విధానంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. కొవిడ్ థర్డ్వేవ్ వేగంగా విస్తరించనుందని, ఎక్కువగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఇప్పటికే 6 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని, వచ్చే నవంబరు లోగా 18 లక్షల మందికి టీకాలువేసేందుకు ప్రణాళికలు వేశామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేసీ మహేష్కుమార్, డీసీహెచ్ఎస్ డా.నాగభూషణరావు, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా.అప్పలరాజు, ఆర్ఎంవో డా.గౌరీ శంకరరావు, మిమ్స్ డైరెక్టర్ డా.భాస్కరరావు, స్పెషల్ ఆఫీసర్ డా. హరికిషన్ కుమార్, వైద్యులు వెంకటేశ్వరరావు, శాంతి ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విభిన్న ప్రతిభావంతులకు వ్యాక్సిన్ వేయించాలి
విజయనగరం దాసన్నపేట: జిల్లాలో విభిన్నప్రతిభావంతులకు వారి ఇంటి వద్దే కరోనా వ్యాక్సిన్ వేయించాలని అఖిలభారత విభిన్న ప్రతిభావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్కు చేరుకోగా, కలెక్టర్ హరిజవహర్లాల్ వారి వద్దకే చేరుకుని సమస్యను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో విభిన్నప్రతిభావంతులు కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు దూర ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారని ఆయన తెలి పారు. ఈ నేపథ్యంలో దివ్యాంగులకు ఇబ్బంది లేకుండా వ్యాక్సిన్ సదుపాయం కల్పించాలని కోరారు.