ఆక్రమణలను అరికడతాం
ABN , First Publish Date - 2022-01-25T04:10:01+05:30 IST
ఆక్రమణలను అరికడతాం
- ఆంధ్రజ్యోతి కథనంతో అధికారుల్లో కదలిక
- వాగు పూడ్చివేతపై కదిలిన జిల్లా యంత్రాంగం
- వాగులో బండరాళ్ల తొలగింపు
ఘట్కేసర్. జనవరి 24 : ఎరిమల్లె వాగు ఆక్రమణపై జిల్లా అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ దిన పత్రికలో ప్రచురితమైన దర్జాగా పూడ్చివేత.. కనుమరుగవుతున్న ఎరిమల్లెవాగు కథనానికి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. వాగును పరిశీలించి పూడ్చివేతనలను తొలగించే పనికి శ్రీకారం చుట్టారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ అలేఖ్య, ఇరిగేషన్ ఏఈ గంగా, ఘట్కేసర్, పోచారం మునిసిపల్ కమిషనర్లు వసంత, సురేష్ తదితరులు వాగు పూడ్చివేతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లేఆవుట్లో ఉన్న ఎక్స్కవేటర్ను తెప్పించి వాగులో వేసిన బండరాళ్లను బయటకు తీయించేశారు. రెండు రోజుల్లో వాగును సర్వేచేయించి సంరక్షణ చర్యలు చేపడతమని అదికారులు తెలిపారు. ఈ సందర్భంగా పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్రెడ్డి, వైస్చైర్మన్ నానావత్ రెడ్డియానాయక్ మాట్లాడుతూ వాగును పూడ్చివేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వాగులో వేసిన రాళ్లను, మట్టిని తొలంగించాలని ఆదేశించారు. అధికారులు తరుచూ వాగులను పరిశీలిస్తూ ఆక్రమణలకు అడుకట్ట వేయాలని సూచించారు. కార్యక్రమంలో నర్సింహ, కాశయ్య, రాఘవేందర్రెడ్డి, శేఖర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.