ఉత్తరాఖండ్ అడవుల్లో చిరుతపులి పిల్ల కళేబరం లభ్యం
ABN , First Publish Date - 2020-10-25T12:33:17+05:30 IST
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ అడవుల్లో తరచూ చిరుతపులులు మృత్యువాత పడుతున్నాయి...
నైనిటాల్ (ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ అడవుల్లో తరచూ చిరుతపులులు మృత్యువాత పడుతున్నాయి. నైనిటాల్ అడవుల్లో శనివారం మూడు నెలల వయసున్న చిరుతపులి పిల్ల కళేబరం వెలుగుచూసింది. నైనిటాల్ ఫారెస్ట్ డివిజను పరిధిలోని మనోరా ఫారెస్ట్ రేంజి వీర్ భట్టి ప్రాంతంలో మూడు నెలల చిరుతపులి పిల్ల కళేబరాన్ని అటవీశాఖ అధికారులు కనుగొన్నారు. వీర్ భట్టి అటవీప్రాంతంలో మూడునెలల చిరుతపులి పిల్ల కళేబరం కనిపించిందని అటవీగ్రామాల ప్రజలు చెప్పడంతో తాము వెళ్లి కళేబరాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తరలించామని మనోరా రేంజి అధికారి భూపాల్ సింగ్ మెహతా చెప్పారు.
చిరుత పులి పిల్ల కొండపై నుంచి కిందపడటంతోపాటు గాయాలున్నాయని, ఏదో జంతువు దాడిలో ఇది మరణించి ఉంటుందని భూపాల్ సింగ్ చెప్పారు. చిరుతపులి పిల్ల మృతికి కారణం ఏమిటనేది పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని రేంజి అధికారి చెప్పారు. ఈ నెల 17 వతేదీన ఏడాది వయసున్న చిరుతపులి కళేబరం ఫితోరాగఢ్ అటవీ ప్రాంతంలో లభించింది. ఈ నెల22వతేదీన మూడు చిరుత పులుల పిండాలు లభించాయి. మరో పులి కళేబరాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.