‘వీఆర్ఏపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి’
ABN , First Publish Date - 2022-04-04T05:29:50+05:30 IST
‘వీఆర్ఏపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి’
చేవెళ్ల, ఏప్రిల్ 3: భూమిని సర్వేచేయకుండా అడ్డుపడుతున్న వీఆర్ఏ సత్తయ్యపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాల్కాపూర్ గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చామంతి శివారాజ్ డిమాండ్ చేశాడు. చేవెళ్లలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని కేసారం, మల్కాపూర్ గ్రామాల సరిహద్దులో ఉన్న భూమిని కొనుగోలు చేసిన తమపైనే కావలి నారాయణ, ఆయన కుమారులు సత్తయ్య, రవీందర్లు దుర్భాషలాడుతూ దాడి చేశారని ఆరోపించాడు. ఈ వివాదానికి సంబంధించి వివరాలను ఆయన వెల్లడించాడు. కేసారం గ్రామంలోని సర్వేనెంబర్ 61/1లో కావలి రాములుకు చెందిన భూమిని 1ఎకరం 34గుంటల భూమిని ప్రైవేట్ మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఈ భూమి రికార్డులో ఉండగా కబ్జాలో మాత్రం 8గుంటల భూమి తక్కువగా ఉండటంతో సర్వే చేసేందుకుగాను చేవెళ్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో గత కొద్ది రోజుల కిత్రం దరఖాస్తు చేసినట్లు తెలిపాడు. అయితే ఈనెల 1న భూమి అమ్మిన రైతు కావలి రాములుతో కలిసి పొలం వద్దకు వెళ్లిన చామంతి శివారాజ్ ఆయన గ్రూప్సభ్యులపైౖ నారాయణ, ఆయన కుమారులు కర్రలు, రాళ్లతో అకారణంగా దాడిచేశారని తెలిపాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో చామంతి శివారాజ్ మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. భూమి అమ్మిన కావలి రాములుకు రికార్డు ప్రకారం 1 ఎకరం 34 గుంటల భూమి ఉండాలి. కానీ కబ్జాలో మాత్రం 8గుంటల భూమి తక్కువగా ఉందని తెలిపాడు. మిగతా భూమిని ఆయన సోదరుడైనా కావలి నారాయణ, కుమారులు అక్రమంగా కబ్జాకు పాల్పడ్డారని వాపోయాడు. కావలి నారాయణ పెద్ద కుమారుడు కావలి సత్తయ్య చేవెళ్ల తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తుండటంతో భూమిని కొలిచేందుకు వచ్చే మండల సర్వేయర్ను రాకుండా కొద్ది రోజులుగా అడ్డుకుంటున్నారని వాపోయాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి భూమి సర్వేను అడ్డుకుంటున్న వీఆర్ఏ సత్తయ్యపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ వివాదంలో రైతు కావలి నారాయణ, రియల్ ఎస్టేట్ వ్యాపారి చామంతి శివారాజ్ ఒకరిపై ఒకరు పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.