బహిర్భూమిగా పాఠశాల ఆవరణం
ABN , First Publish Date - 2021-04-12T05:45:40+05:30 IST
కోరుకొండ మండలం గాదరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణం బహిర్భూమిగా మారి విద్యార్థుల ఆరోగ్యానికి ప్రశ్నార్థకంగా మారుతోంది.
- గాదరాడ హైస్కూల్లో కుక్కలు, పందుల స్వైర విహారం
- ప్రశ్నార్థకంగా మారిన విద్యార్థుల ఆరోగ్యం
కోరుకొండ, ఏప్రిల్ 11: కోరుకొండ మండలం గాదరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణం బహిర్భూమిగా మారి విద్యార్థుల ఆరోగ్యానికి ప్రశ్నార్థకంగా మారుతోంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కరో నా వంటి రోగాల బారిన పడకుండా ఉండాలని ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నప్పటికీ అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామా నికి చేర్చి ఆర్అండ్బీ రహదారికి ఆనుకుని ఉన్న ఈ హైస్కూల్ ఆవరణ కొందరికి సామూహిక మరుగుదొడ్డిగా మారింది. రెండేళ్ల క్రితం సర్వశిక్ష అభియాన్ నిధులతో నిర్మాణం చేపట్టిన అదనపు తరగతి గదులు నేటికి పూర్తికాకపోవడంతో పాఠశాల ఆవరణమంతా కుక్కలు, పందులు, పశువులు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ ఆవరణ చుట్టూ ఉన్న గోడను కూల్చేసి అక్కడ ఏవిధమైన గేటు అమర్చకపోవడంతో ఈ ఆవరణను ప్రజలు రాత్రుళ్లు బహిర్భూమిగా వాడుకుంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తక్షణం పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచి జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.