Telugu Acadamy నిధుల గోల్మాల్ కేసులో తాజా అప్డేట్..
ABN , First Publish Date - 2021-10-12T16:53:23+05:30 IST
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో తొమ్మిది మందిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న...
హైదరాబాద్ సిటీ/హిమాయత్నగర్ : తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో తొమ్మిది మందిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు తాజాగా అరెస్టు చేసిన మరో ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ కేసులో మూడు ప్రధాన అంశాలుగా పోలీసుల విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అకాడమీ అధికారులు, ఉద్యోగుల పాత్ర, పథకాన్ని రచించిన సూత్రధారులు, బ్యాంకు అధికారులు, ఉద్యోగుల పాత్ర.. ఇలా వేర్వేరుగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అరెస్టుకు ముందు దాదాపు నాలుగు రోజుల పాటు అకాడమీ అకౌంట్స్ ఇన్చార్జి అధికారి రమేష్ను రోజంతా విచారించిన పోలీసులు అన్ని వివరాలు తీసుకోనున్నట్లు సమాచారం.
మర్కంటైల్ సొసైటీ చైర్మన్, ఉద్యోగులు, ప్రధాన సూత్రధారి సాయికుమార్ తదితరులు చెప్పిన వివరాల ఆధారంగా ఈ కుంభకోణంలో అతను కూడా భాగస్వామిగా ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. మరోవైపు చందానగర్ కెనరాబ్యాంకు అధికారులు కూడా అకాడమీ అధికారులపై ఫిర్యాదు చేయడంతో ముందు జాగ్రత్తగా రమే్షను పోలీసులు అరెస్టుచేసినట్లు తెలిసింది. రమేష్ పలు కీలక విషయాలు వెల్లడించాడని, వాటి ఆధారంగానే డైరెక్టర్ పీఏగా ఉన్న వినయ్కుమార్ను ఒకరోజు విచారించి, మరుసటిరోజు అరెస్టుచేసినట్లు తెలిసింది. అగ్రసేన్ బ్యాంకు వ్యవహారంపై కూడా ఈడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం.