నిజాలు బయటికొచ్చేదాకా నిద్రపోలేం.. సుశాంత్ సోదరి వీడియో..

ABN , First Publish Date - 2020-08-13T22:58:56+05:30 IST

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సీబీఐ విచారణ చేపట్టాలంటూ ఆయన

నిజాలు బయటికొచ్చేదాకా నిద్రపోలేం.. సుశాంత్ సోదరి వీడియో..

ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సీబీఐ విచారణ చేపట్టాలంటూ ఆయన సోదరి శ్వేతా సింగ్ కీర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఇవాళ ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఓ వీడియో పోస్టు చేశారు. ‘‘సీబీఐ విచారణ కోసం మనం ఓ దేశంగా కలిసి పోరాడదాం. నిష్పాక్షిక విచారణ కోసం డిమాండ్ చేయడం మన హక్కు. నిజం బయటికి రావాలన్న కోరికే తప్ప... మేం ఏదీ ఆశించడం లేదు..’’ అని శ్వేతా సింగ్ పేర్కొన్నారు. తన పోస్టుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా ట్యాగ్ చేశారు. ‘‘నేను సుశాంత్ సోదరిని. సుశాంత్ కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని అభ్యర్థిస్తున్నాను..’’ అని రాసివున్న ఓ ప్లకార్డును సైతం ప్రదర్శించారు. ‘‘నిజాలు బయటికి రాబట్టి, న్యాయం పొందాల్సిన సమయమిది. మా కుటుంబంతో పాటు యావత్ ప్రపంచం వాస్తవాలు తెలుసుకునేలా సహాయం చేయండి. లేకుంటే మేము ఎప్పటికీ ప్రశాంతంగా జీవించలేం..’’ అని శ్వేతా సింగ్ కోరారు. కాగా శ్వేతా సింగ్‌కు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. 



Updated Date - 2020-08-13T22:58:56+05:30 IST