భివానీ గనిపై విరుచుకుపడిన కొండచరియలు
ABN , First Publish Date - 2022-01-01T20:22:15+05:30 IST
హర్యానాలోని భివాని జిల్లా డాడమ్ మైనింగ్ జోన్లో కొండచరియలు శనివారంనాడు విధ్వంసం ..
భివానీ: హర్యానాలోని భివాని జిల్లా డాడమ్ మైనింగ్ జోన్లో కొండచరియలు శనివారంనాడు విధ్వంసం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడటంతో ఒక వ్యక్తి మరణించగా, 15 నుంచి 20 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. మైనింగ్ పనికి ఉపయోగించే 12కు పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఇంతవరకూ శిథిలాల కింద నుంచి ఒక మృతదేహాన్ని వెలిగితీశామని, ముగ్గురుని సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్, ఎస్పీ అజిత్ సింగ్ షెకావత్ ప్రమాద స్థలిలో సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఎంత మంది మృతిచెందారనేది వెంటనే నిర్ధారించలేమని, వైద్యుల బృందం కూడా ప్రమాద స్థలికి చేరుకుందని, సాధ్యమైనంత మందిని కాపాడేందుకు ప్రయత్నిస్తామని మంత్రి జేపీ దలాల్ తెలిపారు. కాగా, కొండచరియలు విరిగిపడాడానికి కారణం తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.