1 నుంచి భూముల మార్కెట్ విలువ పెంపు
ABN , First Publish Date - 2022-01-22T04:13:37+05:30 IST
ప్రభుత్వం భూముల మార్కెట్ విలువ పెంచేందుకు నిర్ణయించింది. సబ్రిజిస్ట్రార్లతో హైదరాబాద్లో గురువారం సమావేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఆస్తుల క్రయవిక్రయాలకు సంబందించి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి.
భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు
వ్యవసాయభూములకు 50శాతం, వ్యవసాయేతర భూములకు 35శాతం
అదనంగా రూ.60కోట్ల ఆదాయం
ఖమ్మంటౌన్, జనవరి 21: ప్రభుత్వం భూముల మార్కెట్ విలువ పెంచేందుకు నిర్ణయించింది. సబ్రిజిస్ట్రార్లతో హైదరాబాద్లో గురువారం సమావేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఆస్తుల క్రయవిక్రయాలకు సంబందించి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ, వస్తున్న ఆదాయం తదితర విషయాలపై చర్చించారు. వచ్చేనెల 1 నుంచి భూముల విలువ పెంచాలని నిర్ణయించిన నేపధ్యంలో ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖకు అదనంగా సుమారు రూ.60కోట్లు ఆదాయం రానుంది.
వ్యవసాయభూములకు 50శాతం
వ్యవసాయ భూములకు 50శాతం, వ్యవసాయేతర భూములకు 35శాతం మార్కెట్ విలువను పెంచనున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే రిజిస్ర్టేషన్ ఛార్జీలను ప్రభుత్వ 20శాతం పెంచగా, ప్రస్తుతం భూముల మార్కెట్ విలువను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపధ్యంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి.
రిజిస్ట్రేషన్ శాఖకు అదనంగా రూ.60కోట్ల ఆదాయం
ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్శాఖకు అదనంగా సుమారు రూ.60కోట్లు ఆదాయం రానున్నది. ఖమ్మం జిల్లాలో 7, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 వేరశి 11 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా ఏడాదికి సుమారు రూ. 200 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి రానున్నది. భూముల మార్కెట్ విలువ పెంచితే మరో రూ.60 కోట్లు అదనంగా ఆదాయం రానున్నది. జిల్లాలో ఖమ్మం రిజిస్ట్రార్ కార్యాలయం తరువాత, ఖమ్మం రూరల్, కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా ఎక్కువగా ఆదాయం వస్తుంది. అయితే భూముల క్రయ, విక్రయాలు పెరగటం, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవటంతో సత్తుపల్లి, కల్లూరు, మధిర సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆదాయం గణనీయంగా పెరిగింది. ఇక కొత్తగూడెం, ఇల్లెందు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా ఆదాయం వస్తుండగా, భద్రాచలం, బూర్గంపాడు కార్యాలయాల ద్వారా తక్కువ ఆదాయం వస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి ద్వారా గతఏడాది డిసెంబర్ నాటికి రూ.200 కోట్లు వచ్చింది. ఈ ఏడాది భూముల మార్కెట్ విలువ పెరిగితే ఏడాదికి మరో రూ.60కోట్లు పెరిగే అవకాశం ఉంది.