వయసు పెరిగే కొద్దీ ఆ శక్తి తగ్గుతుంది.. అందుకే ఆ సమయంలో అలాంటి లక్షణాలు కనిపిస్తాయి..
ABN , First Publish Date - 2021-11-19T20:01:19+05:30 IST
పాలలో ఉండే పిండి పదార్థమైన లాక్టోజును జీర్ణం చేసుకునేందుకు శరీరంలో లాక్టేజ్ అనే ఎంజైమ్ అవసరం. ఈ ఎంజైమ్ చిన్న పిల్లల్లో అధికంగా ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ దగ్గుతూ వస్తుంది.
ఆంధ్రజ్యోతి(19-11-2021)
ప్రశ్న: నలభై సంవత్సరాల వయసు తరువాత శరీరంలో పాలను జీర్ణం చేసుకోగల శక్తి తగ్గుతుందని విన్నాను. నిజమేనా?
- సుధాకర్ రెడ్డి, నిజామాబాద్
డాక్టర్ సమాధానం: పాలలో ఉండే పిండి పదార్థమైన లాక్టోజును జీర్ణం చేసుకునేందుకు శరీరంలో లాక్టేజ్ అనే ఎంజైమ్ అవసరం. ఈ ఎంజైమ్ చిన్న పిల్లల్లో అధికంగా ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ దగ్గుతూ వస్తుంది. ఇలా లాక్టేజ్ తగ్గడం వల్ల పాలు, కొన్ని రకాల పాల ఉత్పత్తులు తీసుకున్నప్పుడు కడుపులో నొప్పి, గ్యాస్, డయేరియా మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. దీనినే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అందరికీ ఉండదు. అలాగే, కొంత మందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నప్పటికీ కొద్ది మొత్తంలో పాలు, పాల ఉత్పత్తులను బాగానే జీర్ణించుకోగలుగుతారు. ఇలా కాని వారికి మాత్రమే పైన చెప్పిన లక్షణాలుంటాయి. పాలు మంచి ప్రొటీన్ ఇచ్చే ఆహారం. కాబట్టి వయసు పెరిగినా లాక్టోజ్ ఇంటాలరెన్స్ లక్షణాలేమి లేనప్పుడు పాలు, పాల పదార్థాలు మానెయ్యాల్సిన అవసరం లేదు. లాక్టోజ్ సమస్య ఉన్నవారు కూడా సమస్య తీవ్రతను బట్టి పెరుగు, మజ్జిగ వంటి కొన్ని పాల ఉత్పత్తులను బాగానే తీసుకోగలుగుతారు. అలాగే ఈ మధ్య లాక్టోజ్ తొలగించిన పాలు, లాక్టేజ్ ఎంజైమ్ కలిపిన పాలు, లాక్టేజ్ ఎంజైమ్ ట్యాబ్లెట్లు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. సమస్య ఉన్నవారు ఈ ప్రత్యామ్నాయాలను లేదా సోయా పాలను వాడవచ్చు.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)