కర్నూలు ఎంపీగానే పోటీ చేస్తా
ABN , First Publish Date - 2021-12-03T04:54:00+05:30 IST
వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేస్తానని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్రెడ్డి అన్నారు.
- పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఎమ్మిగనూరులో ఆఫీసు
- ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల గురించి పట్టించుకోవటం లేదు
- ఎమ్మిగనూరులో కార్యాలయాన్ని ప్రారంభించిన కోట్ల
ఎమ్మిగనూరు, డిసెంబరు 2: వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేస్తానని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్రెడ్డి అన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఎమ్మిగనూరులో ఆఫీసును ప్రారంభించామన్నారు. గురువారం ఎమ్మిగనూరు పట్టణంలోని హెచ్బీఎస్ కాలనీలో ఏర్పాటు చేసిన (కోట్ల క్యాంప్ ఆఫీసు) కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులకు, మంత్రులకు సంపాదన తప్ప ప్రజల సమస్యలు పట్టడం లేదని విమర్శించారు. ఈ ప్రాంతంలో ఇప్పటిగా ఎప్పుడూ వరదలు రాలేదని, పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారని అన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. అనుభవం లేని ముఖ్యమంత్రి కావటం వల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్నారని అన్నారు. జిల్లాలో తాను గతంలో ప్రతిపాదించి మంజూరు చేయించిన నాలుగు ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని, వీటిని పూర్తిచేస్తే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. అయితే ప్రభుత్వం దగ్గర డబ్బులేక సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోవటం లేదని విమర్శించారు. గతంలో కోట్ల విజయభాస్కర్రెడ్డి, ఎన్టీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు మంజూరు చేసిన ఇళకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ పేరుతో ఈ ప్రభుత్వం రూ. కోట్లు వసూలు చేస్తున్నదని ఆరోపించారు. 14, 15 ఆర్థికసంఘం నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందని అన్నారు. ఇక మిగిలింది కో-ఆపరేటివ్ బ్యాంకులేనని అన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల ఉద్యోగసంఘాలు రోడ్డునపడ్డాయని అన్నారు.
కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డిని ఆహ్వానించారా..అని ప్రశ్నించగా చాలాసార్లు ఫోన్ చేసినా ఆయన నుంచి రెస్పాన్స్ రాలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి కోట ్లకుటుంబం పోటీ చేస్తుందా? అని అడగగా.. అదంతా పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కేవీ కృష్ణారెడ్డి, పరమేశ్వరరెడ్డి, బనవాసి ఆదినారాయణరెడ్డి, సుధాకర్ శెట్టి, కదిరికోట ఆదెన్న, ప్రభాకర్ నాయుడు పాల్గొన్నారు.
కోట్లను కలిసిన ఆలూరు నాయకులు
ఆలూరు: మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్రెడ్డిని గురువారం లద్దగిరిలో టీడీపీ నాయకులు కలిశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజల పక్షాన నిలవాలని టీడీపీ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్రెడ్డి సూచించినట్లు తెలిపారు. తెలుగు రైతు కమిటీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, టీడీపీ నాయకులు కృష్ణంనాయుడు, నరసప్ప, రాజశేఖర్, నరసప్ప, ముద్దురంగ, గూళ్యం, రామాంజనేయులు, మసాల జగన్ పాల్గొన్నారు.