నేటినుంచి కృష్ణాష్టమి వేడుకలు
ABN , First Publish Date - 2022-08-18T06:25:49+05:30 IST
తిరుపతి హరేరామ హరే కృష్ణ మార్గంలోని ఇస్కాన్ శ్రీకృష్ణాలయంలో నేటినుంచి మూడురోజుల పాటు జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ఆలయ అధ్యక్షుడు రేవతీ రమణ దాస్ ప్రకటించారు.
తిరుపతి (కల్చరల్), ఆగస్టు 17: తిరుపతి హరేరామ హరే కృష్ణ మార్గంలోని ఇస్కాన్ శ్రీకృష్ణాలయంలో నేటినుంచి మూడురోజుల పాటు జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ఆలయ అధ్యక్షుడు రేవతీ రమణ దాస్ ప్రకటించారు.బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీకృష్ణాష్టమి ప్రత్యేక పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి కారణంగా ఆలయంలో వేడుకలు నిర్వహించలేదన్నారు.ఈసారి పరిస్థితి మెరుగైనందున మూడు రోజుల ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.గురువారం సాయంత్రం ఆరు గంటలకు ఆదివాసీ ఉత్సవం ఉంటుందన్నారు. అనంతరం 7గంటల నుంచి ఆలయం ఎదురుగా ఉండే టీటీడీ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలుంటాయన్నారు.శుక్రవారం జన్మాష్టమి సందర్భంగా ఆలయంలో వేకువజామున 4.15 నుంచి పూజా కార్యక్రమాలుంటాయన్నారు. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుందన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఉట్లోత్సవం, 5 గంటల తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. రాత్రి 11 గంటలకు శ్రీరాధాకృష్ణులకు మహాశంఖాభిషేకం జరుగుతుందన్నారు. భక్తులకు అన్ని వేళలా అన్న ప్రసాద వితరణ జరుగుతుందన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు దర్శన హారతి, ప్రభుపాదుల 126వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం రెండుగంటలవరకు కార్యక్రమాలుంటాయాన్నారు.రూపేశ్వర చైతన్య దాస్, లీలానంద దాస్ తదితరులు పాల్గొన్నారు.